కష్ట కాలం... జగన్ను సాయం కోరిన కేసీఆర్... యుద్దప్రాతిపదికన ఏపీ సీఎం ఆదేశాలు..
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ... ఆగని వానలు జనజీవనాన్ని కకావికలం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా కాలనీలు ముంపులోనే ఉండగా... మళ్లీ వానలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సహాయక చర్యలకు స్పీడ్ బోట్స్ ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి సాయం కోరారు.
కేసీఆర్ విజ్ఞప్తికి జగన్ తక్షణ స్పందన...
వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైదరాబాద్కు స్పీడ్ బోట్స్ పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్ సీఎం జగన్ను కోరారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వరద బాధితులను ముంపు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్పీడ్ బోట్స్ అవసరమని చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన జగన్... వెంటనే అవసరమైన సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా హైదరాబాద్కు స్పీడ్ బోట్లను తరలించేలా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు ఏపీ సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే...
భారీ వర్షాలపై అధికారులతో సమీక్షా సమావేశంలో స్పీడ్ బోట్స్ గురించి కేసీఆర్ చర్చించారు. ఈ పరిస్థితిని గట్టెక్కాలంటే స్పీడ్ బోట్స్ అవసరమని భావించిన సీఎం... వెంటనే సీఎం జగన్ను సంప్రదించారు. జగన్ సానుకూలంగా స్పందించడంతో మంగళవారం(అక్టోబర్ 20) నాటికి ఏపీ నుంచి స్పీడ్ బోట్స్ హైదరాబాద్ చేరవచ్చు. ఇప్పటికీ నగరంలో చాలా కాలనీలు ముంపులోనే ఉండటంతో... చాలామంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పైగా మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో... వరదలో చిక్కుకుపోయినవారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్పీడ్ బోట్స్ను ఉపయోగించనుంది.
ప్రభుత్వంపై విమర్శలు...
గత కొద్దిరోజులుగా వర్ష బీభత్సానికి హైదరాబాద్ జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వానంటే చాలు బెంబేలెత్తుతున్నారు. ఇంటిలోకి మురుగు నీరు చేరి... గృహోపకరణ వస్తువులన్నీ దెబ్బతినడంతో పాటు,తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండటంతో నరకం అనుభవిస్తున్నారు. వాన చినుకులు పడుతున్నాయంటే చాలు... పొంగిపొర్లే డ్రైనేజీలు,నాలాలు,వరదల్లో కొట్టుకుపోయే వాహనాలు,భరించలేని దుర్గంధం.. ఇవే వారికి గుర్తొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పినట్లే హైదరాబాద్ నగరాన్ని సీఎం కేసీఆర్ డల్లాస్ మాదిరి తీర్చిదిద్దారని ప్రభుత్వంపై సెటైర్స్ వేస్తున్నారు.