మౌనం వీడి మా నీటి లెక్క తేల్చండి.. ఏపీ తీరుపై నిప్పుల వర్షం .. కేంద్రానికి సీఎం కేసీఆర్ ఘాటు లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ భేటీ ఈ నెల ఆరవ తేదీన జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి ఘాటు లేఖ రాశారు. నీటి కేటాయింపులలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేసిందని లేఖలో పేర్కొన్న కెసిఆర్ రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత కూడా తమకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని పేర్కొన్న కెసిఆర్ ఇలా చెప్పవలసి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అపెక్స్ కౌన్సిల్ భేటీకి రెడీ అవుతున్న కేసీఆర్..ఏపీ, తెలంగాణా జోలికి రాకుండా..పక్కా ప్లాన్
రాయలసీమ ఎత్తిపోతల పనులు తక్షణమే ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తి
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్ తో నీటి కేటాయింపులు చేయించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకునేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఉందని, పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, దీనిపై జోక్యం చేసుకుని ఆ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఏపీ తీరును , కేంద్ర వైఖరిని ఎండగడుతూ ఘాటు లేఖ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి 15 పేజీల లేఖ రాసిన కేసీఆర్ ఈ లేఖలో కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును,ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా లేఖ రాసిన కేసీఆర్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 క్రింద తెలంగాణ ఫిర్యాదును ఏడు సంవత్సరాలుగా ట్రిబ్యునల్ కు నివేదించ కుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ లేఖలో ప్రశ్నించారు.
కేంద్ర నిర్లక్ష్యం వల్లే నదీజలాల విషయంలో అన్యాయం
కేంద్ర నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా తెలంగాణకు ఇప్పటివరకు రాలేదని ,కేంద్రం తీరు వల్లే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చెలరేగాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు . కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు అసమర్ధ పర్యవేక్షణ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను మరింత పెంచుతుందని సీఎం కేసీఆర్ తన లేఖలో మండిపడ్డారు. ఫిబ్రవరి 2020 లోని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్, రాయల సీమ ఎత్తిపోతల గురించి కృష్ణా బోర్డు దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ టెండర్ ప్రక్రియ చేపట్టకుండా ఆపలేకపోయింది అంటూ ఫైర్ అయ్యారు.
ఏపీ అనధికారిక నీటి వినియోగం , ఆపై తెలంగాణా పైనే ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనధికారికంగా తీసుకుంటున్న నీటిని ఆపకుండా, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తీసుకుంటున్న నీటిని ఆపాలంటూ మమ్ములను ఆదేశించడం షాక్ కు గురి చేసిందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. గోదావరి నదిపై తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏడు ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది . అయితే గోదావరి నదిపై ప్రాజెక్ట్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పూర్తిగా అర్థరహితమని కేసీఆర్ పేర్కొన్నారు .
ఏపీ ప్రాజెక్ట్ లతో తెలంగాణా ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిజైన్ చేసి ప్రారంభించినవే అంటూ వీటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని సీఎం కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించడం వల్ల బోర్డు పర్యవేక్షణ పటిష్టంగా లేకపోవడాన్ని గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ దాన్ని అవకాశంగా తీసుకుని అనధికారికంగా నీటిని మళ్లిస్తుంది అంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు .అందుకే శ్రీశైలం నిర్వహణ కూడా మాకే అప్పగించండి అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
న్యాయంగా రావాల్సిన నీటి వాటాలు దక్కించుకోవడం మా హక్కు .. మౌనం వీడండి
న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు దక్కించుకోవడం మా హక్కు అంటూ పేర్కొన్న కేసీఆర్ తెలంగాణకు ఇంత అన్యాయం ఎందుకు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ప్రశ్నించారు .ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకొని తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు. ఆరో తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో నీటి వాటాల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కెసిఆర్ లేఖ ద్వారా స్పష్టం చేశారు.