ఏపీ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ గుర్రు, విభజన చట్టానికి విరుద్ధమని కామెంట్..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ప్రాజెక్టును అడ్డుకునేందుకున్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హాజరయ్యారు.
Recommended Video
కృష్ణా నుంచి రోజు 10 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీచేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ తరపున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ప్రాజెక్టును అడ్డుకొనేందుకు రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.