కెటిఆర్కు 'కీ'లక శాఖలు, హరీష్ వద్దన్న మైనింగ్ అప్పగింత: తలసానికి షాక్, ఎవరికి ఏది?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు కీలక శాఖలను అప్పగించారు. అదే సమయంలో మంత్రి హరీష్ రావు వదులుకున్న మైనింగ్ శాఖను తనయుడికి అప్పగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా ఝలకిచ్చారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదుగురు మంత్రులకు చెందిన శాఖలను మార్పులు చేశారు. కెటిఆర్కు కీలకమైన శాఖలను అప్పగించారు. వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా (మిషన్ కాకతీయ)లను ముఖ్యమంత్రి కెసిఆర్ తన వద్దే ఉంచుకున్నారు.
కెటిఆర్కు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్, విదేశీ వ్యవహారాల శాఖలను అప్పగించారు. తనకు పని ఒత్తిడి పెరుగుతోందని, మైనింగ్ శాఖ వద్దని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ను కోరిన విషయం తెలిసిందే. అదే మైనింగ్ శాఖను కెటిఆర్కు అప్పగించారు.
ఇక, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఝలక్ ఇచ్చారు. వాణిజ్య పన్నుల స్థానంలో ఆయనకు ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగించారు.
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అదనంగా సహకార శాఖను అప్పగించారు. మంత్రి జూపల్లి కృష్ణా రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించారు. కాగా, తలసాని నుంచి వాణిజ్య శాఖను తీసుకొని తన వద్ద అట్టిపెట్టుకోవడం, హరీష్ రావు వద్దన్న మైనింగ్ శాఖను కెటిఆర్కు అప్పగించడం గమనార్హం. వాణిజ్యం, మిషన్ భగీరథ వంటి కీలక శాఖలను కెసిఆర్ అట్టిపెట్టుకున్నారు.
- ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి వద్ద ఉంది. దానిని కెటిఆర్కు అప్పగించారు. బదులుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇచ్చారు.
- తలసాని వద్ద ఉన్న కీలకమైన వాణిజ్య శాఖను కెసిఆర్ తాను తీసుకున్నారు.
- హరీష్ రావు వద్దని చెప్పిన మైనింగ్ శాఖను కెటిఆర్కు అప్పగించారు.
- సహకార శాఖ ఇప్పటి దాకా మంత్రి జగదీశ్వర్ రెడ్డి వద్ద ఉంది. ఇప్పుడు దానిని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు.