ఉద్యోగుల పాత్ర మరువలేనిది, ప్రగతిపథంలో వాళ్లే కీలకం: ఉద్యోగులపై కేసీఆర్ ప్రశంసలు
హైదరాబాద్: ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లటంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై ప్రగతిభవన్ లో మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందని.. దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఎంతో గౌవరం దక్కుతోందని.. ఇందులో ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని అన్నారు.
'రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. చెక్కులు, పాస్పుస్తకాల పంపిణీలో ఉద్యోగులు సెలవులను కూడా త్యాగం చేసి పాల్గొన్నారు. 58 లక్షలమంది రైతులకు పాస్ పుస్తకాలు ముద్రించాలంటే సామాన్యమైన విషయం కాదు. రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కృషి చేస్తేనే సాధ్యమయింది.' అని తెలిపారు.
జూన్ 2న ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అంగీకరించిందని.. బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామని అన్నారు.
శాశ్వత బదిలీల విధానం తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. బదిలీల్లో ఉద్యోగస్తులైన భార్య భర్తలకు ఒకేచోట అవకాశం కల్పించేలా ఆదేశాలిచ్చామన్నారు. జోనల్ విధానంపై కేబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పంచాయితీ ఎన్నికలకు ముందే ఉద్యోగుల బదిలీలు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు..మూడు రోజుల్లో పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేస్తామని, అగస్టు 15కి ముందే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించామన్నారు. సీపీఎస్ పై అనుమానాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున డెత్ కమ్ గ్రాట్యుటీ చెల్లిస్తామని హామి ఇచ్చారు.
టీచర్ల ఏకీకృత సర్వీసుల కోసం ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుందన్నారు కేసీఆర్. రానున్న 10రోజుల్లోనే కారుణ్య నియామకాలు ఉంటాయని తెలిపారు. పకడ్బందీగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని..దీని కోసం కొత్త పాలసీని రూపొందించే బాధ్యత ఉద్యోగులకే అప్పగిస్తామని అన్నారు. ప్రమోషన్ పాలసీని కూడా స్పష్టంగా రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ట్రాన్స్ ఫర్ పాలసీ పేరుతో ఉద్యోగుల బదిలీలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
ఇక ఉద్యోగులకు ఇచ్చే ఎల్.టి.సి లీవుపై ఎటువంటి నియమ నిబంధనలు ఉండబోవని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆ డబ్బును ఎలా వాడుకున్నా అభ్యంతరం లేదన్నారు. దానికి సంబంధించిన బిల్లులు గట్రా కూడా ప్రభుత్వం అడగదని చెప్పారు.