గులాబీకి అగ్ని పరీక్ష.!ఈడి నుండి బయటపడాలంటే బీజేపీతో లోపాయకార ఒప్పందం.?కేసీఆర్ మును'గోడు'!
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అధికారంలో ఉన్న ఏపార్టీ ఐనా ఉప ఎన్నికంటే సునాయాసంగా గెలుపొందుతామనే ధీమా ఆయా పార్టీల ముఖ్య నేతల్లో ఉంటుంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక అందుకు భిన్నంగా పరిణమిస్తోంది. తీవ్ర త్రిముఖ పోటీ నెలకొన్న మునుగోడు ఉప పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ అడుగులు తడబడుతున్నట్టు తెలుస్తోంది. బీజేపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం మునుగోడు నియోజకవర్గంలో బహిరంగసభను నిర్వహించింది కానీ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీని వెనక కేంద్ర బీజేపి ప్రభుత్వ స్కెచ్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆట మొదలైంది..మునుగోడు ఉప షెడ్యూల్ విడుదల..
మునుగోడు ఉప ఎన్నికలో ముందుకొస్తే నుయ్యి, వెనక్కొస్తే గొయ్యి అన్నట్టుగా మారింది గులాబీ పార్టీ పరిస్థితి. మునుగోడు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికపట్ల టీఆర్ఎస్ పార్టీ మొదటినుండీ అసహనంగానే వ్యవహరింస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మునుగోడు ఉప ఎన్నిక గురించి గానీ, మునుగోడు అభ్యర్ధి గురించి గానీ అంటీ ముట్టనట్టు వ్యవహరించడం కూడా ఆపార్టీ నేతలకు, మునుగోడులో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు మింగుడుపడని అంశంగా పరిణమించింది.
కదంతొక్కుతున్న రాజకీయ పార్టీలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్
మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించిన సీఎం చంద్రశేఖర్ రావు అదే సబలో అభ్యర్దిని ప్రకటిస్తారని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం నిశ్శబ్దంగా నిష్క్రమించారు. దీంతో మునుగోడు ప్రచారంలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ వెనకపడిపోయిందనే చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా వ్యూహాత్కకంగా వ్యవహరించే చంద్రశేఖర్ రావు మునుగోడు అంశానికి వచ్చే సరికి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనే విషయం అంతుచిక్కకుండా పరిణమించింది. ఇదే సందర్బంలో ఓ ఆసక్తికర అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ప్రచారంలో వెనకబడ్డ టీఆర్ఎస్.. అభ్యర్ధి ప్రకటన పట్ల సీఎం నిశ్శబ్దం
మునుగోడు ఉప ఎన్నికల అంశంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న ముందస్తు వ్యూహం టీఆర్ఎస్, బీజేపి పార్టీలు అమలు చేయలేకపోతున్నాయనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ వచ్చిన ఊపు మునుగోడులో బీజేపికి వస్తుందా అనే అంశంపై బీజేపి ముఖ్యనేతల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మునుగోడులో గెలుపు బీజేపిదే అని స్పష్టం చేస్తున్నప్పటికీ లోలోపల కమల నేతలు మదనపడుతున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రభావం బీజేపికి అనుకూలంగా మారిందని, మునుగోడులో రాజగోపాల్ కు ఆ పరిస్ధితులు కనిపించడంలేవనే చర్చ జరుగుతోంది.
బీజేపికి పరోక్ష మద్దత్తు.. ఈడీ నుంచి బయటపడాలంటే తప్పదంటున్న నేతలు
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో క్షేత్రస్ధాయిలో ప్రచారం చేయకపోడం వెనక, అభ్యర్ధిని ప్రకటించకపోవడం వెనక ఓ భారీ మతలబు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేయడం, వారీని దేశ రాజధానిలో విచారించడం వంటి పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి పంటికింద రాయిలా పరిణమించాయి. ఈడీ దాడులను నిలువరించాలన్నా, విచారణను ఎదుర్కొంటున్న నాయకులకు తర్వాత చర్యలను నివారించాలన్నా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బీజేపికి లోపాయకార మద్దత్తు ఇచ్చి, పరోక్షంగా బీజేపి గెలుపు సహకరించి తద్వారా ఈడి ముప్పునుంచి బయటపడాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రశేఖర్ రావు వ్యూహాత్కక నిశ్శబ్దానికి కారణం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.