దుబ్బాకను మరిపించబోయారు.. గ్రేటర్లోనూ దెబ్బైపోయారు... చేజేతులా కేసీఆరే చేసుకున్నారు...
దెబ్బ మీద దెబ్బ... ఊహించని దెబ్బ... సెంచరీ దాటుతామని ధీమాగా చెప్పిన ముఖాలు ఇప్పుడు చిన్నబోయాయి... గ్రేటర్ పీఠం అధికార టీఆర్ఎస్దే కావొచ్చు... కానీ ఎంత మూల్యానికి.. చివరి ఫలితాలు వెలువడేసరికి కనీసం 60 మార్క్ అయినా దాటుతామా లేదా అన్న సందిగ్ధంలో టీఆర్ఎస్ నేతలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. 'దుబ్బాక' ఓటమిని మరిపించే క్రమంలో ఆగమేఘాల మీద గ్రేటర్ ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీ... దూకుడుగా వెళ్లి బొక్కాబోర్లా పడింది. నిజానికి జీహెచ్ఎంసీ కౌంటింగ్ ట్రెండ్స్ ప్రారంభమైన కొద్ది గంటల పాటు టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య 50శాతం సీట్ల వ్యత్యాసం కనిపించినప్పటికీ... మధ్యాహ్నం సమయానికి బీజేపీ గట్టిగా పుంజుకుంది. దీంతో గులాబీ సంబరాల్లో జోష్ తగ్గింది.. గెలుస్తామని తెలిసినా ఆ గెలుపులో మజా లేదని తేలిపోయింది.
ఇవీ ఫలితాలు...
ఇప్పటివరకూ వెల్లడైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం 136 డివిజన్లలో టీఆర్ఎస్ 52 స్థానాల్లో,బీజేపీ 41 స్థానాల్లో,ఎంఐఎం 41 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 14 స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ లెక్కన ఇందులో మొత్తానికి మొత్తం 14 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నా... ఆ పార్టీ సాధించేది కేవలం 66 స్థానాలు మాత్రమే. అంటే, తక్కువలో తక్కువ టీఆర్ఎస్కు 68 స్థానాలు రావొచ్చునన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా తలకిందులైనట్లే.
ఎక్కడ తేడా కొట్టింది...
గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలిచినప్పుడు టీఆర్ఎస్ దాన్ని గాలివాటపు గెలుపుగా కొట్టిపారేసింది. దుబ్బాక ఉపఎన్నికలోనూ బీజేపీ తమనేం ఓడిస్తుందిలే అన్న ధీమాను ప్రదర్శించింది. కానీ సిట్టింగ్ సీటు చేజారడంతో పార్టీలో ఏదో తెలియని అలజడి... రాష్ట్రంలో బీజేపీ హవా మొదలైందన్న చర్చలు... టీఆర్ఎస్ పతనం మొదలైందన్న వాదనలు తెర మీదకు బయలుదేరాయి. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ వెంటనే అప్రమత్తమయ్యారు. దుబ్బాక ఉపఎన్నిక గెలుపును జనం మది నుంచి త్వరగా చెరిపేయాలంటే... వెంటనే గ్రేటర్ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అనుకున్నట్లుగానే హడావుడిగా ఎన్నికల తంతును పూర్తి చేయించగలిగారు. కానీ ఫలితం ఇక్కడ కూడా తేడా కొట్టింది... ఏదో గెలిచామంటే గెలిచామన్న ఓదార్పే తప్ప... బీజేపీ తమను మరింత కిందకు లాగిపడేసిందన్న చేదు నిజం టీఆర్ఎస్ శిబిరానికి జీర్ణించుకోలేని అంశం.
రియాలిటీ వేరు...
నిజానికి నిన్నటి(డిసెంబర్ 3) ఎగ్జిట్ పోల్ ఫలితాలు,ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అర్ధరాత్రి ప్రెస్ మీట్... ఇవన్నీ చూశాక గ్రేటర్లో కమలం ఏ 20 సీట్లకో పరిమితమవుతుందని చాలామంది భావించారు. మహా అయితే 30 సీట్లు సాధిస్తుందనుకున్నారు.ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఎక్కువలో ఎక్కువ 35-38 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాయి. కానీ రియాలిటీ చూస్తే... కాషాయ దళం 50 స్థానాలకు చేరువగా వెళ్తోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి దుబ్బాక ఉపఎన్నికను మించిన జోష్ ఇచ్చాయనడంలో అతిశయోక్తి లేదు.
చేజేతులా కేసీఆరే చేసుకున్నారు...
దుబ్బాక ఉపఎన్నిక ఓటమిని మరిపించే క్రమంలో కేసీఆర్ ప్రదర్శించిన దూకుడు బెడిసికొట్టిందనే చెప్పాలి. జీహెచ్ఎంసీ పాలక మండలికి ఇంకా 3 నెలల సమయం ఉన్నా ముందుగానే ఎన్నికలకు వెళ్లి చేతులు కాల్చుకున్నట్లయింది. ఫలితంగా బీజేపీని చేజేతులా మరో మెట్టు పైకెక్కించి తాను కిందకు పడిపోయినట్లయింది. ఎన్నికల ప్రచారంలో మతం వర్సెస్ అభివృద్దిగా జరిగిన చర్చతో... తెలంగాణ మేదావులు,బుద్ది జీవులు,అభ్యుదయ వాదులు సైతం టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినా... అవేవీ టీఆర్ఎస్ను ఆదుకోలేకపోయాయనే చెప్పాలి. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ను ఖతమ్ పట్టించిన కేసీఆర్కు.. హస్తం పార్టీని ఎదుర్కొన్నంత సులువుగా బీజేపీ హిందుత్వ సిద్దాంతాన్ని ఎదుర్కోలేమని ఈ ఎన్నికలతో మరోసారి తెలిసొచ్చినట్లయింది.
Recommended Video