ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్
కల్వకుర్తి : తెలంగాణలో పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్నాళ్ల నుంచి నిశబ్ధంగా ఉంటున్న మావోయిస్టులు తిరిగి ఉనికి చాటుకుంటుండటం చర్చానీయాంశంగా మారింది. ఆ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖబడ్దార్ సీఎం కేసీఆర్ అంటూ హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని పోతేపల్లి, తాండ్ర, బైరాపూర్ గ్రామాల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు చర్చానీయాంశంగా మారాయి.
వాల్ పోస్టర్లు.. కేసీఆర్ టార్గెట్
తెలంగాణలో మావోయిస్టులు తిరిగి ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని పోతేపల్లి, తాండ్ర, బైరాపూర్ గ్రామాల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి టార్గెట్ గా కనిపిస్తున్న ఆ పోస్టర్లలో ఖబడ్దార్ సీఎం కేసీఆర్ అంటూ హెచ్చరించడం కలకలం రేపుతోంది.
దిక్కుమొక్కు లేని జనం.. ఒక్కొక్కరు అగ్నికణం, మహేంద్ర కర్మకు పట్టిన గతే నీకు తప్పదు, ఉరికొయ్యలు.. చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు అంటూ అందులో పేర్కొన్నారు. బొల్లంపల్లి, పోతేపల్లి, తాండ్ర గ్రామాల్లో ఒకటి చొప్పున పోస్టర్లు అతికించారు.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం .! చైతన్యమా .. రాజకీయ కక్షలా ?
ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు
చాలాకాలం తర్వాత తెలంగాణలో మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుండటం కలకలం రేపుతోంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కనిపించాయి. భద్రాద్రి జిల్లాలో పోలీసులే టార్గెట్ గా పెట్టిన మందుపాతరను కనిపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదలావుంటే లోక్ సభ ఎన్నికల వేళ.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ దుమారం రేపింది. మార్చి చివరి వారంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన రాసిన సుదీర్ఘ లేఖలో.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు సామ్రాజ్యవాద తొత్తులని పేర్కొన్నారు.
ఆ పార్టీలన్నీ కూడ ప్రజా వ్యతిరేకమైనవని, దోపిడీ దొంగ పార్టీలని అభివర్ణించారు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని.. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని లేఖలో కోరారు. అన్ని పార్టీలను, నేతల తీరును ఏకిపారేశారు. సుదీర్ఘ లేఖ రాశారు. 67 ఏళ్ల బూటకపు ఎన్నికల చరిత్ర..! ఎన్నికలు న్యాయంగా, స్వచ్ఛందంగా జరగడం లేదని ఆరోపించారు జగన్. ఇందులో ప్రజల పాత్ర నామమాత్రమేనని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలు బూటకమని, వీటిని బహిష్కరించాలని, నిజమైన ప్రజల రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. అదలావుంటే ఖమ్మం జిల్లాలో పలుచోట్ల పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ మావోయిస్టుల పేరిట పోస్టర్లు కూడా వెలిశాయి.
నేతల గుండెల్లో గుబులు..!
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, ఇప్పుడేమో పరిషత్ ఎన్నికలు.. ఇలా ఎన్నికల వేళ మావోయిస్టులు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. క్రమక్రమంగా పుంజుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతను ఆకర్షించేలా వాల్ పోస్టర్లు వేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం జరుగుతోందనే వాదనలు లేకపోలేదు. అయితే పరిషత్ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో మావోయిస్టులు పోస్టర్లు అతికించడంతో స్థానిక నేతలు భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.