ఆ చట్టాలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చ .. అధికారుల బదిలీలు అందుకే .. 20 న కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనకు కలెక్టర్ లనుండి అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం ప్రగతిభవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు మూడు ముఖ్యమైన అంశాల పైన కలెక్టర్లతో చర్చించనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రెండు రోజుల పాటు సాగే అవకాశం కూడా కనిపిస్తోంది.
రేపు ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ .. కొత్త చట్టాలపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త చట్టాల గురించి చర్చించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన సీఎం క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగని విధంగా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి సమస్య తలెత్తకుండా చట్టాన్ని రూపొందించాలి అంటే వాటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి అన్న దానిపై జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించనున్నారు సీఎం.
కొత్త రెవెన్యూ చట్టం , మున్సిపల్ , పంచాయతీ రాజ్ చట్టలపైనా సమగ్ర చర్చ .. రెండు రోజులు చర్చ సాగే అవకాశం
క్షేత్ర స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న కలెక్టర్లతో సమావేశం ద్వారా తమ అనుభవంలో ఉన్న విషయాలను, ఎదురయ్యే ఇబ్బందులను, ఏ విధంగా చట్టాన్ని తయారు చేస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు వంటి అంశాలపై చర్చ జరిపి కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్ల వద్ద నుంచి తీసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి.. చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతే కాకుండా కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపైన కూడా సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే 60 రోజుల్లో పల్లెలు పట్టణాల్లో అమలు చేయబోయే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉన్నందున రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.
కొత్త చట్టాల రూపకల్పన నేపధ్యంలో కీలక అధికారుల బదిలీలు
కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ . రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేశ్వర్ తివారిని బదిలీ చేసి ఆయన స్థానంలో సోమేశ్ కుమార్ ను నియమించారు .రాజేష్ తివారీని అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీటి పారుదల శాఖ, వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్తోపాటు.. రెరా చైర్మన్గా కూడా సోమేష్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేస్తున్న నీతూకుమారి ప్రసాద్ను కూడా బదిలీ చేసి ఆమె స్థానంలో గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న రఘునందన్రావును నియమిస్తూ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇక ఈ నిర్ణయాలు కూడా త్వరలో తీసుకురాబోతున్న కొత్త చట్టాల నేపథ్యంలోనే తీసుకున్నట్లుగా తెలుస్తోంది.