coronavirus: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం, జాగ్రత్తలపై దిశానిర్దేశం
కరోనా వైరస్ వేగంగా వ్యాపించడంతో నివారణ చర్యలపై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోన్న.. పాజిటివ్ కేసులు పెరగడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేస్తారు.
ప్రగతిభవన్లో సమీక్ష..
మధ్యాహ్నాం 2 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష సమావేశానికి మంత్రులు సహా 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వచ్చిన విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. బుధవారం ఒక్కరోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి వస్తోన్న వారితోనే కరోనా వైరస్ సోకుతుండటంతో.. నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేసే అవకాశం ఉంది.
అలర్ట్.. అలర్ట్..
వైరస్పై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ మరోసారి సూచించే అవకాశం ఉంది. వైరస్ గురించి అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విదేశాల నుంచి వస్తోన్న వారిని పరీక్షలు నిర్వహించి.. ఓకే అనుకుంటేనే వారి స్వస్థలాలకు పంపించాలని తేల్చిచెబుతారు. కరోనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై.. 15 రోజుల కార్యాచరణ పాటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. స్కూళ్లు, కాలేజీలు, బార్లు, పబ్బులు, సినిమా థియేటర్లను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రజలు గుమిగూడొద్దని... వేడుకలు కూడా జరపొద్దని స్పష్టంచేసింది.
Recommended Video
ఒక్కరోజే 8 కేసులు..
బుధవారం వరకు కేవలం ఐదు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. ఆ సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తోంది. ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఆ పాజిటివ్ కేసులు కూడా ఇండోనేషియా నుంచి వచ్చిన ప్రయాణికులవని తేలింది. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు కరీంనగర్ చేరడం, రామగుండానికి ఒక కరోనా అనుమానితుడు చేరడం భయాందోళనకు గురిచేస్తోంది. విదేశాల నుంచి వచ్చేవారికే వైరస్ నిర్ధారణ అవుతోన్న నేపథ్యంలో.. ఎయిర్పోర్టులో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేస్తారు.