ఎస్మా ప్రయోగంతో ఆందోళన అణిచే యత్నం ... నాడు జయలలిత.. నేడు కేసీఆర్ ?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. దసరా పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం మంచిది కాదని, సమ్మెను విరమించుకోవాలని త్రిసభ్య కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ను కోరింది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు ఇవ్వడం, సమ్మెకు వెళ్తే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించడం చేసింది ప్రభుత్వం. అంతే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తూ ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
సమ్మె ఎఫెక్ట్ : అద్దె, స్కూల్ బస్సులతో రవాణా అధికారుల ఏర్పాట్లు
సమ్మెలో పాల్గొంటే సీరియస్ గా చర్యలు అంటున్న ప్రభుత్వం
ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మెలో ఎవరైనా కార్మికులు పాల్గొంటే సీరియస్ గా చర్యలు తీసుకుంటామని చెబుతున్న నేపథ్యంలో ఎస్మా ప్రయోగిస్తారేమో అన్న ఆందోళన ఆర్టీసీ కార్మికులలో నెలకొంది. సీఎం కేసీఆర్ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను స్ఫూర్తిగా తీసుకొని ఎస్మా ప్రయోగిస్తారా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా జరుగుతోంది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు , కార్మిక సంఘాల నాయకులకు సంతృప్తినివ్వలేదు. చర్చలు ఫెయిలయ్యాయని పేర్కొన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి సమ్మెకు వెళుతున్నామని తేల్చిచెప్పారు.
తమిళనాడు తరహాలో కఠిన నిర్ణయం తీసుకునే ఆలోచన
దీంతో నేటి నుండి ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, కమిటీని ఏర్పాటు చేసి మరీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పినప్పటికీ ఆర్టీసీ యూనియన్లు సమ్మె విరమించకపోవటం పై సర్కారు సీరియస్ గా ఉంది. తమిళనాడు తరహాలో...తెలంగాణ సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం ఆపివేసేందుకు, అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాటి ముఖ్యమంత్రి జయలలిత తరహాలో ఎస్మా ప్రయోగిస్తారేమో అన్న ఆందోళన
ఆర్టీసీలో పనిచేసే వాళ్లందరూ కార్మికులందరూ పబ్లిక్ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్ ఇదే విషయం చెబుతోంది. ఎస్మా ప్రకారం సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లినపుడు నిర్దాక్షిణ్యంగా ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగించారు జయలలిత. దాదాపుగా లక్ష మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయారు అని అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తెలంగాణలో కూడా జయలలిత తరహాలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగాలు పోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు .
ఎస్మా ప్రకారం ఉద్యోగాలు పోయే ఛాన్స్ .. ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ ఉన్నతాధికారుల అభిప్రాయం నేపథ్యంలో సహజంగానే ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. ఎస్మా... అత్యవసర సేవల నిర్వహణ చట్టం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుంది. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించిన నేపథ్యంలో ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎస్మా ను ప్రయోగించాలి అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చట్టం ఆధారంగా తమ డిమాండ్ల సాధనకు పూనుకున్న తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష మందిని 2003 లో నాటి ముఖ్యమంత్రి జయలలిత ఒక్క కలం పోటుతో తీసి పారేశారు. ప్రజాగ్రహానికి గురైన జయలలిత తరువాతి ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది.
నాటి సీఎం జయలలిత బాటలో కేసీఆర్ ?
మరి
ఇప్పుడు
జయలలిత
బాటలో
నడవాలి
అనుకుంటున్న,
ఆమెను
స్ఫూర్తిగా
తీసుకుని
ఎస్మా
ప్రయోగించి
కార్మికులను
కట్టడి
చేయాలనుకుంటున్న
గులాబీ
బాస్
కెసిఆర్
కార్మికులను
అణచివేసే
ధోరణిలో
ముందుకు
వెళితే
భవిష్యత్తులో
ఇబ్బందికర
పరిణామాలు
ఎదుర్కోవాల్సి
వస్తుందని
విశ్లేషకులు
భావిస్తున్నారు.
కార్మికుల
సమస్యలు
పరిష్కరించడానికి
గులాబీ
బాస్
కెసిఆర్
అసలు
ఏ
మాత్రం
చొరవ
చూపలేదు
అని
తాజా
హస్తిన
పర్యటన
చేస్తున్న
ఆయన
తీరును
చెప్పకనే
చెబుతుంది.
కేసీఆర్ ని నమ్మని కార్మికులు .. డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమ్మె
ఇక అలాంటి సమయంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కెసిఆర్ ఎప్పుడో సమస్యలు పరిష్కరిస్తారు అంటే నమ్మే స్థితిలో లేరు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కెసిఆర్ ఇప్పుడు చొరవ తీసుకోవాలి అనేదే కార్మికుల ఆలోచన. సీఎం కేసీఆర్ కానీ, ట్రబుల్ షూటర్స్ అయిన మంత్రులు కానీ కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపకుండా త్రిసభ్య కమిటీ వేసి చేతులు దులుపుకోవడం, సమ్మె కి వెళితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించడం ఆర్టీసీ పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని చెబుతోందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఆందోళన అణచివేసే ప్రయత్నం కెసిఆర్ చేస్తుంటే, ఒకవేళ అదే గనుక జరిగితే ఆందోళన మరింత ఉధృతమవుతోందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.