ఏపీ బాగుంది, అభివృద్ధి సూపర్, మళ్లీ 'సీఎం'గా వస్తా: కేసీఆర్, 'రాజకీయం కాదు'
హైదరాబాద్/విజయవాడ: మొక్కులో భాగంగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెజవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారం దక్కాలని దుర్గమ్మను కోరుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగుందని ఆయన కితాబిచ్చారు.
Recommended Video
బెజవాడ దుర్గమ్మకు తీర్చే మొక్కు ఇదే: కొండపై 'కేసీఆర్' నినాదాలు, వద్దన్న సెక్యూరిటీ
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ దశదిశ మారిపోతుందని చెప్పారు. ఇది కేసీఆర్ ఆధ్యాత్మిక పర్యటన అని, ఇందులో రాజకీయాలకు తావు లేదని తేల్చి చెప్పారు. కాగా, ఉదయం విజయవాడ వెళ్లి అమ్మవారికి మొక్కు తీర్చుకున్న కేసీఆర్, మధ్యాహ్నం మూడు గంటల వరకు హైదరాబాద్ వచ్చారు.
విజయవాడ అభివృద్ధిపై కేసీఆర్
విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. బందర్ రోడ్డును బాగా విస్తరించారని పేర్కొన్నారు. రోడ్డుకు రెండు వైపులా పెయింటింగులు బాగున్నాయని తెలిపారు. బందర్ రోడ్డు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీనరీ బాగుందన్నారు. గన్నవరం విమానాశ్రయం కూడా బాగుందన్నారు.
మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తాను
అమ్మవారి దర్శనం బాగా అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాను మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చి మళ్లీ అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వస్తే బెజవాడ దుర్గమ్మ తల్లికి ముక్కుపుడక సమర్పించుకుంటానని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మొక్కులు సమర్పించుకున్నారు.
అమ్మవారికి ముక్కుపుడక
తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తాను మొక్కిన దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. గతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం చెల్లించుకున్నారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు.
హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్
బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ఉన్న దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ముక్కు పుడక 11.29 గ్రాముల బరువు ఉంది. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న సీఎంకు దేవస్థానం మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికింది. అనంతరం దుర్గమ్మకు ముక్కు పుడకను సమర్పించి కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంటనే అర్చకులు ముక్కుపుడకను అమ్మవారికి అలంకరించారు. దర్శనం అనంతరం కేసీఆర్ తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
స్వాగతం పలికిన దేవినేని
గన్నవరం విమానాశ్రయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.. కేసీఆర్కు, కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన ముక్కుపుడకలో పాలపిట్ట, చెట్టుకొమ్మ వచ్చేలా చేశారు. పాలపిట్ట, చెట్టుకొమ్మ (జమ్మిచెట్టు) అంటే దసరా. దసరా అమ్మవారి పండుగ. ఇక ఈ ముక్కు పడకలో 57 వజ్రాలు పొందుపర్చారు. ఈ ముక్కు పుడక అర్ధచంద్రాకారంలో ఉంది. ఏపీలో కేసీఆర్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్తో దుర్గగుడికి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ కే కేశవ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. దుర్గగుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడికి వచ్చిన కేసీఆర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.