నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకుంటే రాజీనామా తప్పదు, నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్
Recommended Video
గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పినా.. పెడచెవిన పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోవాలని.. లేదంటే రాజీనామా చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతోన్న పనులపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తవాలని స్పష్టంచేశారు. విద్యుత్ సమస్యలను కూడా తీర్చాలని తేల్చిచెప్పారు. దీనిని ఎనిమిది నెలల గడువు విధించారు. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తవకుంటే నేతలకు పదవులు, అధికారులకు ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు.
సంబంధిత ప్రజాప్రతినిధులు రాజీనామా తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. లేదంటే సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. కొన్ని మున్సిపాలిటీలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయని.. వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీకి చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. మున్సిపాలిటీల్లో అవినీతి మరక పోవాలన్నారు.
పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతోన్న పనుల వివరాలు తెలుసుకొని ఆగ్రహాం వ్యక్తం చేశారు.