కేసీఆర్కు ఏమైంది?: యశోదా ఆసుపత్రిలో చేరిక: అనారోగ్యానికి కారణం ఇదే
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన కొద్దిసేపటి కిందటే సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు.
Recommended Video
యశోదా ఆసుపత్రి డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆయనకు ప్రాథమికంగా వైద్య పరీక్షలను చేపట్టారు. అనంతరం మాగ్నిటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ), కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్లను వెంటనే నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.
అంతకుముందు- కేసీఆర్.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సోమాజీగూడలోని రాజ్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. హిమా కోహ్లీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారని, అనంతరం ఊపిరితిత్తులు, ఛాతీలో మంటగా అనిపించడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని అంటున్నారు.