ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ: ఇప్పటికే ఆలస్యం..మీకు నా మద్దతు: బెస్ట్ విషెస్
హైదరాబాద్: ఇన్నాళ్లూ ఉప్పు-నిప్పులా ఉంటూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆ విషయంలో ఒక్కటయ్యారు. తాను ప్రధానితో ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. నరేంద్ర మోడీకి లేఖ రాసి.. మరీ శభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోన్నందుకు కేసీఆర్ తన విషెస్ను తెలియజేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ప్రధానికి లేఖ రాశారు.
ఆ కార్యక్రమమే.. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్
కేసీఆర్ మెచ్చుకున్న ఆ ప్రాజెక్ట్ పేరు.. సెంట్రల్ విస్టా. ఈ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని చేపట్టబోతోన్న విషయం తెలిసిందే. దీనికి ప్రధానమంత్రి.. బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తలపెట్టిన ప్రాజెక్ట్ అది. దీనికోసం గుజరాత్కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ యాజమాన్యం నమూనాలను అందించింది.
ట్రయాంగిల్ పార్లమెంట్ బిల్డింగ్..
ఈ ప్రాజెక్ట్ కింద త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ను నిర్మిస్తారు. ప్రపచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించేలా, దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీన్నినిర్మాణం ఉంటుంది. భారీ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ఉంటాయి. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనాన్ని ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందంటూ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించడం.. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
శరవేగంగా పూర్తి కావాలంటూ..
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని అందుబాటులోకి తీసుకుని రావడంలో ఇప్పటికే ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి కావాలని ఆయన అకాంక్షించారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ భవనాలు సరిపోవట్లేదని, ఈ పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కేంద్రం పూనుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
దేశం గర్వించేలా..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు.. దేశ సార్వభౌమత్వానికి, స్వయం సాధికారికతకు అద్దం పడుతుందని తాను భావిస్తున్నట్లు కేసీఆర్.. ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. యావత్ దేశం గర్వించేలా నిర్మితం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. దేశ సంస్కృతిని ఉట్టి పడేలా రూపుదిద్దుకోనున్న ఈ భారీ ప్రాజెక్టు.. నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలం పాటు దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.