పరిశోధనలన్నీ ఇక్కడే, డిఆర్డీఓకి కలాం పేరు: మోడీకి సిఎం కెసిఆర్ లేఖ
హైదరాబాద్: నగరంలోని రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ)కు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
రక్షణ రంగంలో భారత్ అనేక విజయాలు సాధించేందుకు డీఆర్డీవోలో జరిగిన అనేక పరిశోధనలు దోహదపడ్డాయని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు డైరెక్టర్గా అబ్దుల్ కలాం పనిచేశారని.. ఆయన హయాంలోనే అనేక పరిశోధనలు జరిగాయని వివరించారు.
డీఆర్డీఎల్, మిథాని, ఆర్సీఐ, ఐసీబీఎం వంటి రక్షణ పరిశోధన సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటు కావడం వెనుక కలాం కృషి ఉందని కొనియాడారు. హైదరాబాద్ నగరంతో ఎంతో అనుబంధం ఉన్న కలాం పేరు డీఆర్డీవోకు పెట్టడం వల్ల భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తుందని సిఎం కెసిఆర్ ప్రధానికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.
నిమ్స్ను సందర్శించిన లక్ష్మారెడ్డి
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఓ వ్యక్తికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంతో వైద్యులను మంత్రి అభినందించారు. అనంతరం కాలేయం మార్పిడి చేయించుకున్న వ్యక్తిని పరామర్శించారు.