ఆర్టీసి సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం! ఉద్యోగులను చేర్చుకొనే అంశంపై ఉత్కంఠ!
హైదరాబాద్ : తెలంగాణలో ఓ ప్రహసనం ముగిసింది. 47 రోజులుగా ఆర్టీసి కార్మికులు చేసిన సమ్మెకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లభించకుండానే సమ్మెను ముగించినట్టు ప్రకటించారు జేఏసీ నాయకులు. అంతే కాకుండా సమ్మె చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలనే డిమాండ్ ను ప్రభుత్వానికి విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది.
టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?
ఆర్టీసి కార్మికుల డిమాండ్లు, 47 రోజులుగా చేసిన సమ్మె, ఆర్థిక నష్టం, ముఖ్యమంత్రి స్వయంగా విధించిన డెడ్ లైన్లను భేఖాతరు చేయడం వంటి అంశాలను సీఎం చంద్రశేఖర్ రావు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి సాయంత్రం ప్రగతి భవన్ లో జరగబోవు ఉన్నత సమీక్షా సమావేశంలో ఈ అంశాల పట్ల చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువారం ఆర్టీసీపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రవాణా శాఖ ముఖ్య అధికారులతో పాటు పలువురు ప్రముఖులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత చంద్రశేఖర్ రావు నిర్వహిస్తున్న సమావేశం కావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆర్టీసి ఉద్యోగులు తమకు ఎటువంటి షరతులు విధించకుండా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రకటించారు.
ఇదిలా ఉండగా సీఎం సమీక్షా సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు. సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సీఎం సమీక్ష తర్వాత ఆర్టీసి కార్మికుల పట్ల ప్రకటన ఉంటుందా..? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.