ఈమె సిఎం భార్యనా?: ఇలా అందరితో సాధారణ మహిళలా...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ ఓ సాధారణ మహిళలా అందరినీ పలకరిస్తూ ఊరంతా కలియదిరిగారు. శోభ సొంత గ్రామమైన మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామాన్ని బుధవారం సందర్శించారు. చింతమడక గ్రామంలో బుధవారం బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. పరామర్శించిన అనంతరం గ్రామంలో పర్యటించారు.
గ్రామ ప్రజల యోగాక్షేమాలను స్వయంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. కనిపించినవారినల్లా పలకరించారు. వారితో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆమె సాధారణ మహిళల వ్యవహరించడం గ్రామ ప్రజలను ఆనందానికి గురి చేసింది. తన బంధువులతో కలిసి గతంలో తాము ఉన్న ఇంటిని, తమకున్న స్థలాలను పరిశీలించారు. గ్రామంలో కెసిఆర్కు ఉన్న స్థలాల్లో ఎస్బిహెచ్ బ్యాంక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశు వైద్యశాలలను ఏర్పాటు చేశారు.
ఎస్బిహెచ్ కార్యాలయంలోకి వెళ్లగానే అక్కడ గోడకు ఉన్న అత్తమామలైన కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావుల చిత్రపటానికి దండం పెట్టారు. బ్యాంకులో ఉన్న గదులు చూస్తూ అందులో తాము నివాసం ఉన్నప్పుడు ఏ గదిలో ఏం ఉండేదో గుర్తు చేసుకుంటూ బంధువులకు చెప్పారు. గ్రామంలోని ఆయా స్థలాల్లో ఎవరు ఉంటున్నారంటూ అడిగి తెలుసుకున్నారు.
దానికి ముందు ఐమె కెసిఆర్ తల్లిదండ్రుల స్మారకార్థం నిర్మించిన కెవిఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఆవరణను సందర్శించారు. మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్న లక్ష్మిని పేరు పెట్టి పిలిచి బాగున్నావా అటూ పలకరించారు. మంగమ్మ లేదా అంటూ అడిగారు. గ్రామంలోని తెలిసినవారినంతా ఆమె పేరు పెట్టి పలకరించారు.
సిద్ధిపేట మండలం చింతమడకలో కెసిఆర్ వదిన సుభద్ర ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నరు. దశ దిన కర్మ పూర్తయ్యే వరకు దాదాపు ఐదు గంటల పాటు ఆమె గ్రామంలోనే ఉన్నారు.