కేటీఆర్కు జగన్ బర్త్ డే విషెస్... ట్విట్టర్లో పోటెత్తిన శుభాకాంక్షలు... మీరే నంబర్.2 అన్న సంతోష్.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ కేటీఆర్కు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కు విషెస్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.' అంటూ ట్వీట్ చేశారు.
Recommended Video
యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..' హ్యాపీ బర్త్ డే డియర్ తారక్... ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో మీరు చూపించే చొరవకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మున్ముందు మరింతమందికి మీ సహాయ సహకారాలు అందేలా మరింత శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.' అని ట్వీట్ చేశారు.
ఆర్థికమంత్రి,కేటీఆర్కు స్వయాన బావ హరీశ్ రావు కూడా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కేటీఆర్కు బర్త్ డే విషెస్ చెప్తూ.. సమకాలీన రాజకీయాల్లో మిమ్మల్ని మించిన నంబర్.2 లేరని వ్యాఖ్యానించడం గమనార్హం. మీరొక ఐకాన్ అని ప్రశంసించిన సంతోష్.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను చేరుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కేటీఆర్కు ట్విట్టర్లో విషెస్ చెప్పగా... 'థ్యాంక్స్ చిచ్చా..' అంటూ బదులివ్వడం విశేషం.
కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో #GiftAsmile అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వెలిగించాలని... అదే కేటీఆర్ బర్త్ డేకి మనమిచ్చే నిజమైన గిఫ్ట్ అని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ హాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
Wishing you a very happy birthday, my dear brother Tarak. May God bless you with good health & abundance of happiness. @KTRTRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2020
మంత్రులు,ఎమ్మెల్యేలు,పార్టీ కార్యకర్తలు,సినీ తారలు,క్రీడాకారులు ఇలా అన్ని వర్గాల నుంచి కేటీఆర్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నేటితో కేటీఆర్ 44వ వడిలోకి అడుగుపెడుతున్నారు. 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్... ఆ ఎన్నికల్లో కేవలం 171 ఓట్లతో గెలుపొందారు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లో రాటుదేలిన ఆయన తనదైన మాట,రాజకీయంతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. డిసెంబర్,2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ పట్టాభిషేకం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే అవన్నీ ఊహాగానాలకే పరిమితమైనప్పటికీ... ఏదో ఒకరోజు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం మాత్రం ఖాయమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది.