కెసిఆర్ను ఉక్కిరిబిక్కిరి చేసిన సిబిఐ, ఆ లింకేమిటి?: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సీబీఐ రెండు, మూడు గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తమకు తెలిసిందని, అయితే ఆ వివరాలను సీఎంవో ఎందుకు గోప్యంగా ఉంచుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణం కుంభకోణంలో కేసీఆర్ను సీబీఐ విచారించినట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మత్స్యశాఖ ఇంజనీరు వెలుగుబంటి సూర్యనారాయణ అందించిన ఆర్థిక సహకారంతోనే టీఆర్ఎస్ భవన్ను నిర్మించారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోఎన్బీసీసీకి కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్ట్ను వెలుగుబంటి సూర్యనారాయణ ఆధ్వర్యంలోని మత్స్యశాఖకు కేసీఆర్ కేటాయించారని అంటూ దాని వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కేసీఆరే ఆ కాంట్రాక్టును కేటాయించినట్టు అప్పట్లో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తే సీబీఐకి తెలిపినట్టు తమకు సమాచారం ఉందన్నారు. వెలుగుబంటి సత్యనారాయణతో కేసీఆర్కు ఉన్న అనుబంధం, సంబంధం ఏమిటో తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. వెలుగుబంటి సూర్యనారాయణతో టీఆర్ఎస్ నేతలకు ఉన్న అనుబంధం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు.
సూర్యనారాయణ అవినీతి ఫైళ్లు గల్లంతు కాకుండా చూడాలని 2008లో ప్రభుత్వానికి విపక్ష నేతలు లేఖ రాశారని, ఆ లేఖపై అప్పట్లో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఈటల రాజేందర్ సంతకం పెట్టారని, ఆ లేఖకు ఆయన కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు.
ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే కేసీఆర్ను సీబీఐ విచారించిందని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి విరాళాలుల ఇచ్చిన వారి వివరాలను బహిర్గతం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.