మోడీ రివర్స్: చంద్రబాబు, కెసిఆర్ మధ్య కోల్డ్ వార్, ప్రకటన చిచ్చు కూడా...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం మార్చడం కూడా అందుకు ఓ కారణంగా తెలుస్తోంది.
చంద్రబాబుకు దూరమవుతూ నరేంద్ర మోడీ కెసిఆర్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇది చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు. చాలా కాలంగా కెసిఆర్ మోడీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంగా కెసిఆర్ను కాస్తా దూరంగా ఉంచుతూ వచ్చారు. చంద్రబాబుకు క్రమంగా దూరమవుతూ మోడీ కెసిఆర్కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆటంకంగా మారిందని అంటున్నారు.
నిప్పు రాజేసిన కెసిఆర్ ప్రకటన...
ఆంధ్రప్రదేశ్లో టిడిపి కన్నా వైఎస్ఆర్సిపికే ప్రజలు అనుకూలంగా ఉన్నారని, టిడిపికి అనుకూలంగా 43 శాతం, వైఎస్ఆర్సిపికి అనుకూలంగా 45 శాతం ఓటర్లు ఉన్నట్టు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో మీడియాతో అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది కూడా చంద్రబాబుకు, కెసిఆర్కు మధ్య దూరాన్ని పెంచినట్లు చెబుతున్నారు.
Recommended Video
గవర్నర్ సమక్షంలో చర్చలు విఫలం....
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమవుతాయా, లేదా అనే సందేహం నెలకొంది. గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమస్యలు పరిష్కారించుకుంంటారా, లేదా అనుమానాలు కలుగుతున్నాయి. విభజన సమస్యలను ఉమ్మడి గవర్నర్ సమక్షంలో పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించన నేపథ్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ చర్చలు కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి.
భగ్గుమన్న విభేదాలు...
కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన 24మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను విధుల్లో చేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన 90మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం చేర్చుకుంది, అటువంటి స్థితిలో తాము రిలీవ్ చేసిన ఎఎస్వోలను మీరెందుకు చేర్చుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ లేఖ రాశారు. ఈ ఘాటైన లేఖ రెండు రాష్ట్రాల మధ్య నిప్పు పెట్టింది.
కేంద్రానికి తెలంగాణ లేఖ...
కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులను నిలిపేయాలని కోరుతూ తెలంగాణ తాజాగా కేంద్రానికి ఓ లేఖ రాసింది. దీంతో వివాదం మరింత ముదిరింగి. కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాలు కూడా పట్టు సడలించడం లేదు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గోదావరి నది యాజమాన్య మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాలేదు.సిడబ్ల్యుసి అనుమతి లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారని తెలంగాణ వాదిస్తోంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఉందా అని, హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అనుమతి ఎవరిచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది.
ఎందుకు ఖాళీ చేయడం లేదు...
హైదరాబాదబులో గల సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శాఖలన్నీ అమరావతికి తరలిపోయాయి. అయితే ఇక్కడి నుంచి కార్యాలయాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించడం లేదు. దీనిపై గవర్నర్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ భేటీలో తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్యాలయాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు.
సమస్య ఆలాగే ఉంది...
ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన తమను తెలంగాణ రిలీవ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 1253మంది విద్యుత్ ఉద్యోగులు కోర్టుకెక్కారు. గవర్నర్ సమక్షంలో జరిగిన మంత్రుల కమిటీలో ఈ విషయంపై చర్చ జరిగినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో జనాభా నిష్పత్తి ప్రకారం వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 52శాతం, తెలంగాణ ప్రభుత్వం 48శాతం వేతనాలు చెల్లిస్తున్నాయి. దానికితోడు షెడ్యూల్ 9,10 పరిధిలో సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగుల విభజన ఇంకా అలాగే ఉంది.