టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి చుక్కలు: తడాఖా చూపిన కలెక్టర్ దేవసేన..
ఈ కుంట ఎమ్మెల్యే కబ్జా కోరల్లో ఉండటంతో.. ఈసారి వేడుకలను ఆ ప్రదేశంలో నిర్వహించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: కలెక్టర్లకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కలెక్టర్లు నిజాయితీగా తమ డ్యూటీ చేస్తే.. ఎమ్మెల్యే మోకాలు అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగునా వారికి అడ్డంకులు సృష్టిస్తూ అవసరమైతే బదిలీ వేటు వేసేదాకా తీసుకెళ్తున్నారు.
వర్షంలోనే వాగ్వాదం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కలెక్టర్కు మధ్య కోల్డ్ వార్
గతంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి బదిలీ విషయంలో ఇదే జరిగిందంటారు. ఇక కొద్దిరోజులుగా జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనకు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య కొనసాగుతున్న వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ఓపిక పడుతూ వచ్చిన కలెక్టర్ దేవసేన.. ఇక ఎమ్మెల్యే అక్రమాలను ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
బతుకమ్మ కుంట:
కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల మధ్య తాజా వివాదానికి కేంద్రబిందువు 'బతుకమ్మకుంట'. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలు ఇక్కడే నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ కుంట ఎమ్మెల్యే కబ్జా కోరల్లో ఉండటం.. వివాదాలతో ముడిపడి ఉండటంతో.. ఈసారి వేడుకలను ఆ ప్రదేశంలో నిర్వహించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే అక్రమాలు:
బతుకమ్మ కుంటను ఐదెకరాల మేర పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్ దేవసేన ఆరోపణలు చేశారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ఆమె వివరించారు. దీనికి ప్రభుత్వం నుంచి నిధులు కూడా తెచ్చుకునేందుకు ప్రయత్నం జరిగినట్లు తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని చెప్పుకొచ్చారు. కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆమె ఈ వివరాలు వెల్లడించారు.
వివాదాస్పద ప్రదేశంలో వద్దని:
బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్ దేవసేన తెలిపారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. అయినా సరే! పెద్దగా చర్యలేమి లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు:
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు.
అంతకుముందు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి బదిలీ విషయంలోను స్థానిక టీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్లే పనిచేశాయన్న వాదన ఉంది. నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా బదిలీ విషయంలోను ఇదే జరిగిందంటారు.
ఇక మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మధ్య ప్రోటోకాల్ వివాదం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఇలా కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.