ఫిబ్రవరిలోనే హైదరాబాద్కు బదిలీ.. కానీ పరిస్థితులు.., తండ్రితో కల్నల్ సంతోష్ చివరి మాట అదే..
భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం(జూన్ 15) రాత్రి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా.. ఇందులో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్(37) కూడా ఉన్నారు. విషాదం ఏంటంటే.. నిజానికి ఇటీవలే ఆయనకు హైదరాబాద్ బదిలీ అయింది. మూడేళ్ల పాటు ఆయన ఇక్కడే పనిచేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా రాలేని పరిస్థితుల్లో అక్కడే విధుల్లో కొనసాగారు. చైనాతో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు.
Recommended Video
ఫిబ్రవరిలోనే ట్రాన్స్ఫర్...
చాలా కాలంగా సంతోష్ హైదరాబాద్ బదిలీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంతోష్ లెఫ్టినెంట్ కల్నల్ హోదా నుంచి కల్నల్ హోదా అందుకున్నాక బదిలీకి ఆమోదం లభించింది. కానీ అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే లోపే కేంద్రం దేశంలో లాక్ డౌన్ విధించింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఇండో-చైనా సరిహద్దులోని లదాఖ్లోనే విధులు నిర్వర్తించాల్సిందిగా సంతోష్కు పైనుంచి ఆదేశాలు వచ్చాయి.' అని సంతోష్ మామ గణేష్ బాబు తెలిపారు.
తండ్రి ఆవేదన...
సంతోష్ తండ్రి ఉపేందర్ మాట్లాడుతూ.. ''దేశానికి సేవ చేయాలన్న నా కోరిక కుమారుడి రూపంలో నెరవేరింది. సంతోష్కు కూడా చిన్నతనం నుంచే దేశంపై బాగా మమకారం ఉండేది. సంతోష్ పెద్దయ్యాక సైన్యంలో చేరి నా కలను నెరవేర్చినందుకు చాలా సంతోషించాను. సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడం ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తండ్రిగా చాలా బాధ కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఒక్క నిమిషమే నాతో మాట్లాడాడు. కోవిడ్ 19 పరిస్థితులు చక్కబడితే సెప్టెంబర్లో తాను లదాఖ్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. అమ్మతో మాట్లాడతాను.. ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చాను. అదే సంతోష్ చివరి మాట.' అంటూ ఆయన తండ్రి ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేటలో అంత్యక్రియలు
కల్నల్ సంతోష్ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వస్థలం సూర్యాపేటకు తరలించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థీవ దేహం సూర్యాపేటకు చేరనుంది. జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.
చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలన్న ఆసక్తి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్-మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు.ఉపేందర్ ఎస్బీఐ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. నిజానికి సైన్యంలో చేరి దేశ సేవ చేయాలన్నది ఆయన కల. తన విషయంలో అది సాధ్యపడకపోవడంతో కుమారుడిని సైన్యంలోకి పంపించాలనుకున్నారు. సంతోష్ కూడా సైన్యంలో చేరాలన్న ఆసక్తితో చిన్నతనం నుంచే కష్టపడ్డారు.
ముఖ్య నేతల సంతాపం...
సూర్యాపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్లో సంతోష్ చదువుకున్నారు. అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్లో లెఫ్ట్నెంట్గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో విధుల్లో చేరాడు. ఆయన వీర మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా తదితరులు ఇప్పటికే ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సంతోష్ కెరీర్...
సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు గోల్డ్ మెడల్స్ సంపాదించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని లదాఖ్లో (కల్నల్) కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను సంతోష్ అంతమొందించారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయా, లదాఖ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆయన పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు.