డిప్యూటీ కలెక్టర్గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి... సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్...
భారత్-చైనా ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి శనివారం(అగస్టు 15) డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సీఎస్ సోమేష్ కుమార్ ఆమె రిపోర్ట్ను ఆమోదించారు.
జూన్ 15న తూర్పు లదాఖ్లోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆయన కుటుంబానికి రూ.5 కోట్లు, హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో కేటాయించిన 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంతోష్ బాబు పిల్లల పేరిట రూ. 4 కోట్లు చెక్,ఆయన తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్ను అందజేశారు.అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. జులై నెలలో ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. హైదరాబాద్ ప్రాంతంలో పోస్టింగ్ చేయమని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్గా సంతోషి శిక్షణ పూర్తయ్యే వరకూ ఆమెకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు. కల్నల్ కుటుంబానికి కేసీఆర్ అందించిన భారీ ఆర్థిక సాయంతో పాటు,ఆ కుటుంబానికి అండగా నిలిచిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.