రంగుపడుద్ది.. ఆ స్నాక్స్ తింటే అంతే సంగతి..!!
నిజామాబాద్ : రంగు రంగుల కలర్లు.. ఆకట్టుకునే బొమ్ముల.. అందులో నోరూరించే చిరుతిండి. వాటిని చూస్తే చాలు కొనేదాకా వదలరు చిన్నపిల్లలు. వారి నాడీ పట్టిన కంపెనీలు క్వాలిటీ గాలికొదిలేసి .. ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే తినుబండారాలు అందిస్తూ .. పిల్లల ఆరోగ్యానికి చేటు చేస్తున్నారు.
కల్తీ పోటు ..
ఉదయం లేచినప్పటి నుంచి గల్లీలో ఉండే షాపు నుంచి .. సూపర్ మార్కెట్లలో ఒక్కటే గిరాకీ. రకరకాల పేర్లతో పిల్లలకు తినుబాండారాలు అందిస్తున్నారు. వాటిని చూసిన వారు కొనేవరకు విడిచిపెట్టారు. దీంతో వారికి తల్లిదండ్రుల చేతులమీదుగానే విషతుల్య రసాయనాలతో తయారుచేసిన పదార్థాలు అందడం దురదృష్టకరం. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా విక్రయాలు జరుపడం విస్మయం కలిగిస్తోంది. సాధారణంగా జిల్లా కేంద్రాలతోపాటు మండలాల్లో తినుబాండారాలు బీభత్సంగా అమ్ముడుపోతున్నాయి.
జోరుగా వ్యాపారం ..
కంపెనీలకు రూ.లక్షలలో వ్యాపారం జరుగుతుంది. వారికి బిజినెస్ జరగకుంటే ఆలోచిస్తారు. వ్యాపారం సవ్యంగా సాగడంతో బిజినెస్ విస్తరించి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. పిల్లలు ఉండే స్కూల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలు, గల్లీ షాపుల్లో తినుబాండారాలు జోరుగా కనిపిస్తున్నాయి. వాటిని పిల్లలు ఎంచక్కా కొనుక్కొని తిని .. క్షణికానందానికి గురవుతున్నారు. కానీ భవిష్యత్లో మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోరా ..?
కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్న ఆహార కల్తీ నియంత్రణ, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నగరాలు, పట్టణాలే కాదు .. గ్రామాల్లో తనిఖీలను మరచిపోవడంతో .. వ్యాపారులకు బిజినెస్ మాత్రం జరుగుతుంది. కానీ పిల్లల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తగ్గుముఖం పట్టడం లేదు. అయితే దీనిపై మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కంపెనీలు, వ్యాపారులపై కొరఢా ఝులిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరుగుతుందంటే ..
కల్తీ చిరుతిండ్లతో ఆకలి సరిగా వేయకపోవడం, కడుపులో నట్టలు తయారవుతాయని వైద్యులు చెప్తున్నారు. చిన్నప్పుడే పిల్లలకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. తినుబాండారాలకు పిల్లలను దూరంగా ఉంచాలని కోరుతున్నారు. దాని బదులు పోషక ఆహారాలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.