సిలబస్లో తెలంగాణ అస్తిత్వమే, స్పష్టత ఉండాలి: కోదండరామ్
నిజామాబదా్: తెలంగాణ అస్తిత్వమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ) గ్రూప్స్ పరీక్షల సిలబస్లో ఉందని తెలంగాణ రాజకీయ చైర్మన్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో టీఎస్పీఎస్సీ సిలబస్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
గ్రూప్-1, గ్రూప్-3 సిలబస్లో పెద్దగా తేడా లేదని మౌలిక అంశాలన్నీ కామన్గానే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ చరిత్ర, భౌగోళిక, సాంస్కృతిక అంశాలు, తెలంగాణ ఉద్యమచరిత్ర, వివిధ దశలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ పట్ల సమగ్ర అవగాహన ఉన్నవారే భవిష్యత్ తెలంగాణ అధికారులుగా ఉండాలన్న ఉద్దేశంతో నే గ్రూప్స్ సిలబస్లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
విద్యార్థులు చిన్న ఉద్యోగాలు లక్ష్యం కాకుండా సివిల్స్ గ్రూప్-1 సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలవైపు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు గ్రూప్స్లో విజయం సాధిస్తేసరి, లేకపోయినా అనేక ఉద్యోగ అవకాశాలుంటాయని, ఒక్కటే తొవ్వలేదు, అనేక తొవ్వలు ఉంటాయని ప్రొఫెసర్ కోదండరాం వివరించారు. తెలంగాణ అంటే అసఫ్ జాహీల కాలం, ముల్కీ ఉద్యమం, సాలార్ జంగ్ సంస్కరణలు, హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆరు సూత్రాల ఒప్పందం విఫలం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, పాల్వంచ ఘటన, 1969 ఆంధ్ర గో బ్యాక్, భావవ్యాప్తి, 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం, రాజకీయ ఉద్యమం, తెలంగాణ, ఏర్పాటు లాంటి అంశాలు క్షుణ్ణంగా చదివి, ఆకళింపు చేసుకొని వ్యక్తీకరించాలని ఆయన వివరించారు. మొత్తం చరిత్రను ఒక పద్ధతిలో చదవాలని, నిరాశ చెందవద్దన్నారు.
రిసోర్స్ పర్సన్గా హాజరైన మరో ఆచార్యులు ప్రొఫెసర్ సి.గణేష్ విద్యార్థులు గ్రూప్స్కు ఎలా సిద్ధం కావాలో మార్గనిర్దేశం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో ఎనిమిది అంశాలు కీలకమని వాటిలో భారతదేశ చరిత్ర-ఆధునిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సమాజం తదితర అంశా లు, భారతీయ, తెలంగాణ ఆర్థిక అంశాలు క్షుణంగా చదవాలని అన్నారు. సైన్స్ టెక్నాలజీ, సమకాలీన అంశాలు, జనరల్ స్టడీస్ తదితర అంశాలు కీలకమన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ చాన్స్లర్ పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులను కార్యోన్ముఖులను చేశారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని, సోమరితనం, అలసత్వం వంటివి దరిచేరనివ్వరాదన్నారు. మంచి ఉదాహరణలతో, చిన్నచిన్న కథలతో విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు. వర్సిటీ తరపున మరిన్ని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ గురించి తెలిసినవారే తెలంగాణకు భవిష్యత్ నిర్దేశం సరిగా చేస్తార న్న ఉద్దేశంతోనే తెలంగాణ సిలబస్లో ప్రాధాన్యం కల్పించారన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ బాలాశ్రీనివాసమూర్తి, డాక్టర్ కె.అపర్ణ, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తిల ఆధ్వర్యంలో పోటీ పరీక్షల విభాగం, సమాన అవకాశాల విభాగం, ప్లేస్మెంట్ సెల్ తరఫున సంయుక్తంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.