ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ప్రారంభిస్తాం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్2ను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన టీ-హబ్ నాలుగో వార్షికోత్సవం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
టీ-హబ్ నాలుగేళ్లలో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉందని అన్నారు. సాంకేతి రంగంలో 2020 అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని ఆయన వ్యాఖ్యానించారు. 2020ని కృత్రిమ మేధస్సు సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
టీ-హబ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేకత చాటుకుందని తెలిపారు. స్టార్టప్, ఐటీ ఎకో సిస్టమ్లో తెలంగాణకు అగ్రస్థానం దక్కిందని మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలోని అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ-వర్క్స్ను త్వరలోనే ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. ఇన్నోవేషన్, స్టార్టప్లలో అంతర్జాతీయ స్థాయి భాగస్వాములతో తెలంగాణ ముందుకు పోతోందన్నారు.
మేడ్చల్లోని అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్లో ఇంజినీరింగ్ విద్యలో వస్తున్న మార్పులపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులోనూ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, 150 దేశాల ఇంజినీరింగ్ విద్య నిపుణులు పాల్గొన్నారు.
యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం టాస్క్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
టాస్క్తో కలిసి పనిచేసేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీఎస్ఐపాస్ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఇన్నోవేషన్, ఇంక్లూజివ్, గ్రోత్లను తాను బలంగా నమ్ముతానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు ఐటీ సంస్థలు, పరిశ్రమలను తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు.