సెక్రటేరియట్ కూల్చివేతపై కమిటీ..! అసెంబ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామన్న కేసీఆర్..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణాలో భవంతుల నిర్మాణాల సీజన్ కనిపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం, ఎమ్మెల్యేలకు నూతన గృహ నిర్మాణాలు, ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం శాసన సభ, సచివాలయ భవంతుల నిర్మణాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఎర్ర మంజిల్ లో నూతన అసెంబ్లీ సముదాయాన్ని, ఇప్పుడున్న సచివాలయంలో కొత్త భవనాలు నిర్మాణం చేయాలని నిర్ణయించామని సీఎం కే.చంద్రశేఖర్ రావు తెలిపారు.
ఈ నెల 27వ తేదీన భూమి పూజ చేస్తున్నామని చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సచివాలయ భవనాలు పూర్తిగా కూల్చివేయాలా, పాక్షికంగా కూల్చివేయాలా అనే దానిపై ఆర్ అండ్ బీ మంత్రి నేతృత్వంలో కమిటీ వేస్తున్నామని, కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకువెళ్తామని అన్నారు. పాత అసెంబ్లీ భవనం నమూనాలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం ఉంటుందని, ఆ ప్రకారంగానే డిజైన్ రూపొందిస్తున్నారన్నారు. 100 కోట్ల రూపాయల చొప్పున అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం చేస్తామన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు సత్వరం పూర్తయిందని, ఈ ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమారు 5వేల టీఎంసీల నీళ్లను తెలంగాణలోని, ఆంధ్రలోని ప్రతి అంగుళానికి తీసుకువెళ్తామన్నారు. పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం ముందుకు తీసుకువెళ్తామన్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు ఉండేవని, జగన్ సీఎం కావడంతో దాదాపు సమసిపోయాయని అన్నారు.
పొరుగు రాష్ట్రాలతో సంబంధాలపై చర్చాంచామన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనకు ఆమోదం తెలిపామన్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపుపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినిమా దర్శకులు శంకర్ కు రంగారెడ్డి జిల్లా మోకిల లో ఐదెకరాల భూమి, 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాల కోసం స్థలాలు కేటాయించామన్నారు చంద్రశేఖర్ రావు .