కరోనా వైరస్.. సామాన్యుల చావుకొచ్చిందా.. ఇదీ గ్రౌండ్ రియాలిటీ..
కరోనా వైరస్ పంజాకు అమెరికా,చైనా,స్పెయిన్ లాంటి అభివృద్ది చెందిన దేశాలే ఎంతగా విలవిల్లాడుతున్నాయో కళ్లముందు కనిపిస్తోంది. వైరస్ నియంత్రణకు ఆ దేశాలు తీసుకున్న చర్యలు మిగతా దేశాలకు మార్గదర్శకంగా మారాయి. అందులో లాక్ డౌన్ ఒకటి. అయితే అభివృద్ది చెందిన దేశాలకు,భారత్ లాంటి అభివృద్ది చెందుతోన్న దేశాలకు చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా పేదరికంలో. భారత్లో ఎక్కువ శాతం ప్రజలు పేద,మధ్య తరగతి వర్గాలకు చెందినవారే కావడంతో లాక్ డౌన్ ఎఫెక్ట్ వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అన్నమో రామచంద్రా..
సాధారణ రోజుల్లో ఉదయం లేవగానే అడ్డా మీదికి వెళ్లి నిలబడే కూలీలను ఎవరో ఒకరు పనికి పిలిచేవారు. ఆరోజుకు వచ్చే కూలీతో సాయంత్రానికి ఇంటికి అవసరమయ్యే దినుసులు,వస్తువులు కొనుక్కొని ఇళ్లకు వెళ్లేవారు. ఇంటిల్లిపాదీ పనిచేస్తే గానీ అందరి ఆకలి తీరని కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. రోడ్డు పైకి వస్తే పోలీసులు వెళ్లగొడతారు.. ఇంట్లో ఉంటే పస్తులు తప్పవు. దీంతో కూలీలంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఓ దినసరి కూలీ ఆవేదనను సీపీఎం పార్టీ తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది.
'అయ్యా మేమిక్కడ ప్రతీరోజూ కూలీ పని చేసుకుని రూ.200 సంపాదించుకుని పొట్ట నింపుకునేవాళ్లం. ఇలా కర్ఫ్యూలు పొడగించడం వల్ల ఇళ్లు,వాకిలి లేని మావాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల కాదు,మంచినీళ్లు,తిండి లేకపోవడం కారణంగానే మాలో ఎక్కువమంది చనిపోయేలా ఉన్నారు..' అని అక్కడి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు ఒకింత ఉపశనమే అయినా..
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంట్లో ఒక్కొక్కరికి రూ.12కిలోల ఉచిత బియ్యంతో పాటు రూ.1500 ఇస్తామని ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్తో పాటు రూ.1000 ఇస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 29 వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏపీలో గ్రామ వలంటీర్లు రేషన్తో పాటు నగదు మొత్తాన్ని అందజేయనున్నారు. తెలంగాణలో ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై జిల్లా యంత్రాంగాలు కసరత్తు చేస్తున్నాయి. పేదరికంలో ఉన్నవారికి ఇవి ఒకింత ఉపశమనమే అయినా పూర్తి స్థాయిలో వారి అవసరాలను తీర్చగలవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.1000,రూ.1500తో ఖర్చులు తీరుతాయా అని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రతీ పేద కుటుంబానికి రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇళ్లు,వాకిలి లేని అభాగ్యుల పరిస్థితి దయనీయం..
తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ చర్యలు ఒకింత ఉపశమనంలా కనిపిస్తుండగా.. ఇళ్లు,వాకిలి లేని అభాగ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరి కోసం ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యేక చర్యలు ప్రకటించలేదు. కూలీ పనుల కోసం ఆయ పట్టణాలకు వలసొచ్చిన వీరు లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. పనులు లేక,తిండి దొరక్క అలమటిస్తున్నారు. కనీసం ఉండేందుకు ఏదైనా గూడు చూపించినా.. ఎవరైనా పెడితే తిని.. లేదంటే పస్తులతోనైనా అక్కడే పడుకుంటామని చెబుతున్నారు. ఇలాంటి వారి కోసం ఏపీలో కొన్నిచోట్ల కొంతమంది అన్నదానాలు కూడా చేస్తున్నారు. అయితే ఇవి కొత్త సమస్యలను సృష్టించేవిగా మారుతున్నాయి. అందరూ ఒకేసారి గుంపులు గుంపులుగా ఎగబడుతుండటంతో వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్టవుతోంది.
అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులు.. బెగ్గర్స్ తరలింపు..
ఇక తెలంగాణలో.. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్లో దాదాపు 500 మంది బెగ్గర్స్ని గుర్తించి చౌటుప్పల్లోని ఓ ఆశ్రమానికి తరలించారు. అయితే ఒకేసారి అంతమందిని ఆశ్రమానికి తీసుకురావడంతో.. వారందరికీ తిండి పెట్టడం సమస్యగా మారింది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో.. విరాళాలు ఇచ్చే దాతలు కనిపించట్లేదు. దీంతో ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ ఆశ్రమం యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఇందుకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సానుకూలంగా స్పందించారు. ఇక భవన నిర్మాణ కార్మికుల కోసం పంజాబ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.3వేలు ఇవ్వనున్నట్టు ఇటీవల ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వారి గురించి ప్రత్యేక చర్యలేవీ చేపట్టలేదు. వారు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నారో.. ఆ కాంట్రాక్టర్లే వారి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ కాంట్రాక్టర్లు ఎంతవరకు బాధ్యాతయుతంగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే.
మోత మోగుతున్న కూరగాయల ధరలు
ఇక లాక్ డౌన్ కారణంగా తలెత్తిన మరో సమస్య నిత్యావసరాలు,కూరగాయల ధరలు అమాంతం పెరగడం. ఏపీ,తెలంగాణల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్లోని మోండా మార్కెట్,ఎర్రగడ్డ రైతు బజార్లలో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. సాధారణ రోజుల్లో కిలో రూ.20-రూ.40 ఉండే మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.160-రూ.180కి చేరింది. కిలో బెండకాయ రూ.60-రూ.80,కిలో గోరు చిక్కుడు రూ.80,కిలో వంకాయలు రూ.80లకు చేరాయి. ఈ ధరలను చూసి సామాన్యులు షాక్ తిన్నారు. కొన్నిచోట్ల వ్యాపారులతో గొడవలకు దిగారు. అదును చూసి ఇలా ధరలు అమాంతం పెంచడంపై వారు ఆగ్రహం చేస్తున్నారు. తెలంగాణలో కొత్త ఆంక్షల నేపథ్యంలో నివాసాలకు 3కి.మీ దూరంలో ఉన్న కిరాణ షాపులు,కూరగాయల షాపుల్లోనే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇదే అదునుగా స్థానిక కిరాణ షాపు యజమానులు,కూరగాయల వ్యాపారులు ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. ధరల నియంత్రణకు ఒక కమిటీని వేస్తామని చెప్పినప్పటికీ.. నియంత్రణ ఎంతవరకు అమలవుతుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.