సీఎంఓ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన సామాన్యుల ఆవేదన .. ఏమంటున్నారో తెలుసా ?
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ఒక వైపు , సమ్మె చేస్తున్న పట్టించుకోకుండా మొండి వైఖరితో ప్రవర్తిస్తున్న ప్రభుత్వ తీరు మరోవైపు వెరసి సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో స్కూళ్లకు కాలేజీలకు సెలవులను పొడిగించడంపైన తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎంవో కార్యాలయానికి సామాన్యులు ఫోన్స్ చేస్తున్నారు. సీఎంవో హెల్ప్ లైన్ కు కాల్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
సెలవులు పొడిగించటంపై సామాన్యుల ఆగ్రహం
తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి సీఎం హెల్ప్ లైన్ కు కాల్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. ఆర్టీసీ బస్సులు కూడా మా కోసమే. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ మధ్యలో మేం నలిగిపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల స్కూళ్లకు , కాలేజీలకు ఆర్టీసీ సమ్మెతో ఏం సంబంధం ? సెలవులు పొడిగించడం ఎందుకు ? అని ప్రశ్నించారు.
ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే స్కూల్ బస్సులను వాడుకుంటారా ?
ఇప్పటికే స్కూళ్లకు 16 రోజులు సెలవులిచ్చారని , పిల్లలు చదివిన చదువులు మరిచిపోతున్నారని ఇక ఇదే సమయంలో మరిన్ని రోజులు సెలవులు పొడిగించడం వల్ల పిల్లల చదువులు సాగుతాయా అని ప్రశ్నించారు . ఆర్టీసీ వాళ్లు సమ్మె చేస్తే, ప్రత్యామ్నాయంగా స్కూలు బస్సులను వాడుకోవడం ఏంటి? అంటూ సామాన్యుడు రంజిత్ కుమార్ సీఎం కార్యాలయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇక అంతే కాదు ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రి లాంటి వాడని చెప్పిన రంజిత్ కుమార్ ఎక్కడైనా పిల్లలు అల్లరి చేస్తుంటే, పిలిచి మాట్లాడి, బుద్ధి చెప్పాలి గానీ, నువ్వు పోతేపో లేదంటే నేను పీకేస్తా అని మొండి తనానికి పోవడం, గొడవలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారని తెలుస్తుంది.
ఉద్యమాలను అణచివేయటం హేయం
ఇది పాలించే పద్ధతి కాదని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతి విషయానికి మూర్ఖత్వంతో ప్రవర్తించటం మంచిది కాదని హితవు పలికినట్లుగా తెలుస్తుంది. ఉద్యమాలతోనే తెలంగాణను తెచ్చుకున్నామని, అటువంటి ఉద్యమాలను అణచి వేయడం ఏంటని కూడా హెల్ప్ లైన్ లో ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరు సరికాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని పేర్కొనటంతో పాటు సీఎం కేసీఆర్ ప్రతిదీ నేను వినను నేను చెయ్యను అంటే రాష్ట్రంలో నడవదని గట్టిగానే మాట్లాడారు.
సీఎంఓ హెల్ప్ లైన్ కు కాల్స్ .. ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాన్యులు
తన మాటలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రంజిత్ సీఎం హెల్ప్ లైన్ లో తన మాటలు విన్న వ్యక్తికి తెలియజేశారు. హెల్ప్ లైన్ లో రంజిత్ ఒక్కరే కాదు, సిద్దిపేటకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి కూడా సీఎంఓ హెల్ప్ లైన్ కి కాల్ చేసి సమ్మె విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపద్యంలో తాజా పరిణామాలపై సామాన్యులు సైతం స్పందిస్తూ ఏకంగా సీఎం గా కార్యాలయానికి ఫోన్ కాల్ చేసి తమ అభిప్రాయాలను చెబుతుండడం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పాలన సరిగా లేదని చెప్పడానికి తార్కాణం గా నిలుస్తోంది.