భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ... కత్తిపోట్లకు గురైన రిపోర్టర్... భగ్గుమన్న బండి సంజయ్...
నిర్మల్ జిల్లాలోని భైంసా మరోసారి అల్లర్లతో అట్టుడికింది. ఆదివారం(మార్చి 7) రాత్రి పట్టణంలోని జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమంది అల్లరి మూకలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఇద్దరు రిపోర్టర్లు,ఇద్దరు పోలీసులు,ఏడుగురు స్థానికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఓ రిపోర్టర్ కత్తిపోట్లకు గురవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో భైంసాలో రాత్రికి రాత్రే 600 మంది పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇద్దరు వ్యక్తుల గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణగా...
మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లుగా తెలుస్తోంది. జుల్ఫేర్ గల్లీలో మొదలైన ఘర్షణ ఆ వెంటనే కుభీర్ రోడ్,గణేశ్ నగర్,మేదరి గల్లి,బస్టాండ్ ప్రాంతాలకు విస్తరించినట్లు సమాచారం. దాడులకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే వీటిని షేర్ చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం భైంసాలో 144 సెక్షన్ అమలుచేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భైంసాలో అసలేం జరుగుతోంది : రాజాసింగ్
భైంసా అల్లర్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక చిన్న యాక్సిడెంట్ ఈ దాడులకు కారణమైందని అన్నారు. ప్రమాదానికి మత కోణం రుద్దడంతో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. దాడిలో విజయ్ అనే రిపోర్టర్ కత్తిపోట్లకు గురయ్యాడని,ఓ ఆటో డ్రైవర్పై దాడి జరిగిందని అన్నారు. అసలు భైంసాలో ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అని నిలదీశారు. గతంలోనూ భైంసాలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఒక వర్గం వారి పైనే కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. కనీసం ఇప్పుడైనా వాస్తవాలు బయటపెట్టాలని... వన్ సైడ్ చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
భగ్గుమన్న బండి సంజయ్...
భైంసా అల్లర్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ట్విట్టర్లో స్పందించారు. అల్లర్లను ఖండిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇద్దరు రిపోర్టర్లు,బీజేపీ కార్యకర్తలు,పోలీసులు గాయపడటం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మనం భారత్లో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? అని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని... ప్రభుత్వ పెద్దలకు భయపడి ఒక వర్గానికి కొమ్ము కాయవద్దని అన్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లే అక్కడ తరుచూ అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్...
భైంసా అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాలన్నారు. భైంసాలోని బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి... ఎవరూ అధైర్యం చెందవద్దని చెప్పినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా నాయకులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భైంసాలో డీఎస్పీ నర్సింగ్రావు,నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్ ప్రస్తుతం అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.