'మోడీని తిట్టేందుకే హైదరాబాదులో సీపీఎం మహాసభలు, కమ్యూనిజం కనుమరుగు!'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కనుమరుగు అవుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడానికే సీపీఎం మహాసభలు పెట్టిందన్నారు.
కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్, త్రిపురలో చిత్తుగా ఓడిపోయారని, లోపాలు ఏమిటో వారు తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో కమ్యూనిస్టులు బతికి బట్ట కట్టలేరన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా సీపీఎం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏజెంటుగా కమ్యూనిస్టులు పని చేస్తున్నారని, దేశ ప్రజలు కమ్యూనిస్టులను తిరస్కరించారన్నారు.
కాగా, ఐదు రోజుల పాటు హైదరాబాదులో సీపీఎం సమావేశాలు జరిగాయి. అనంతరం చివరి రోజైన ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో వారు బీజేపీని, మోడీనే టార్గెట్ చేశారు.
మతతత్వం, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకొన్న డబ్బులను లూటీ చేసి దేశం వదిలిపెడుతున్న వారిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ.. ఇలా మోడీలందరూ కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన సరళీకరణ ఆర్థిక విధానాలను బీజేపీ ముమ్మరం చేసిందన్నారు. కుబేరులకు మేలు చేసే విధానాలకు పెద్ద పీట వేసిందన్నారు. నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయన్నారు. నిరుద్యోగం ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరిందన్నారు.
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపకుండా ఈ వర్గాలకు న్యాయం జరగదన్నారు. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరింది.