'అంతకన్నా పెద్ద పుస్తకం రాసుకోండి; హరీష్, పరిపూర్ణానందలు అదుపు తప్పుతున్నారు'
న్యూఢిల్లీ/హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై దేశవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు మీడియాలోను, ఇటు జనంలోను దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐలయ్యపై అది పచ్చి అబద్దం: కేటీఆర్ హరీష్లకు 'బహుజన ప్రతిఘటన'
తాజాగా సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు పుస్తకంపై స్పందించారు. పుస్తకం శీర్షికపై అభ్యంతరం తెలిపిన ఆయన.. ఐలయ్యను చంపుతామని బెదిరించడం మాత్రం సమంజసం కాదన్నారు.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
అంతకన్నా పెద్ద పుస్తకం రాసుకోండి:
పుస్తకంపై వైశ్యులకు అభ్యంతరం ఉంటే అంతకంటే పెద్ద పుస్తకం రాసుకోవాలని, శాంతియుత పద్ధతుల్లో అభ్యంతరం తెలపాలని రాఘవులు సూచించారు. అంతేకానీ భౌతిక దాడులకు దిగుతామనడం, చంపుతామని బెదిరించడం సరికాదన్నారు.
ఐలయ్యకు రక్షణగా నిలుస్తాం:
ఆర్యవైశ్యుల బెదిరింపుల నేపథ్యంలో.. అవసరమైతే ఐలయ్య రక్షణ బాధ్యతను సీపీఎం కార్యకర్తలు తీసుకుంటారని రాఘవులు చెప్పారు. పుస్తకం రాసే హక్కు ఐలయ్యకు ఉందన్నారు.
సమర్థించం: తమ్మినేని వీరభద్రం
పుస్తకం కులం పేరుతో ఉండటాన్ని సీపీఎం సమర్థించదని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఐలయ్యకు పుస్తకం రాసే హక్కు ఉందని రాఘవులు పేర్కొంటే.. తమ్మినేని అందుకు విరుద్దంగా స్పందించడం గమనార్హం.
చంపుతామనడం సరికాదు:
పుస్తకంపై అభ్యంతరాలుంటే ఖండించాలే కానీ.. చంపుతామని బెదిరించడం సరికాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ముమ్మాటికీ భావప్రకటన స్వేచ్ఛపై దాడేనని అన్నారు.
హరీష్, పరిపూర్ణానంద అదుపు తప్పుతున్నారు:
కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై అర్థవంతమైన చర్చ జరిపి వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ టీజీ వెంకటేష్, పరిపూర్ణానందస్వామి అదుపు తప్పి మాట్లాడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.