రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు ఎవరు?
హైదరాబాద్: రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ గురువారం వెలువడింది. కేంద్రం ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో అలజడి మొదలైంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 31న ముగుస్తుంది. ఎన్నికలు అనివార్యమైతే జూన్ 11న నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీహెచ్, గుండు సుధారాణిల పదవీ కాలం జూన్ 21తో ముగుస్తోంది. గుండు సుధారాణి కొన్ని నెలల క్రితమే టీడీపీని వీడి టీఆర్ఎస్ చేరిన విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు స్థానాల భర్తీ కోసం తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
దీంతో తెలంగాణకు వచ్చే రెండు రాజ్యసభ స్ధానాల కోసం గట్టి పోటీనే ఉంది. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికైన ఎమ్మెల్యేలు 119 మంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రతిస్థానం ఎన్నికకు 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. రెండు స్థానాలకు 82 ఓట్లు కావాలి.
అసెంబ్లీలో ఈ స్థాయిలో బలం ఒక్క అధికార టీఆర్ఎస్కి మాత్రమే ఉంది. రాష్ట్ర విభజనకు ముందు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, టీడీపీ 15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైసీపీ 3, బీఎస్పీ 2 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో విజయం సాధించారు.
ఆ తర్వాత టీఆర్ఎస్లోకి బీఎస్పీ సభ్యులు ఇద్దరు, టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు విలీనమయ్యారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
వీటన్నింటితో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 81కి చేరింది. అంటే మొత్తంగా ఒక్క ఓటు తక్కువ ఉన్నప్పటికీ, ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాలు దక్కించుకోవటానికి అవసరమైన ఓట్లు టీఆర్ఎస్కే ఉంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చే ఈ రెండు రాజ్యసభ స్థానాలను తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా టీఆర్ఎస్ గెలుచుకోనుంది.
దీంతో ఆ రెండు స్థానాలు దక్కేదెవరికన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా పలువురు నేతలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి రాజ్యసభ కోసం విజ్ఞప్తులు చేసుకున్నారు. వివిధ రాజకీయ సమీకరణలు, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాని సమాచారం.
తొలి నుంచీ పార్టీలో కొనసాగిన వారు, కష్టకాలంలో ఆదుకున్న వారు, పార్టీ కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచిన వారు, అనివార్య పరిస్థితుల వల్ల అవకాశాలు దక్కని వారు.. ఇలా పలు కోణాల్లో ఆలోచించి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక వారి పేర్లను ప్రకటించడమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రేసులో ఉన్నది వీరే?
రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ముందంజలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈయనతో పాటు టీఆర్ఎస్ కోశాధికారిగా పార్టీకి చాలాకాలం సేవలు అందించిన దామోదరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
దామోదర్రావుకు పక్కాగా రాజ్యసభ అవకాశం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్గా పనిచేసి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు. పార్టీ మారే సమయంలోనే రాజ్యసభ సీటు ఇచ్చే హామీతో వచ్చారన్న ప్రచారం జరిగింది.