పోటీ పరీక్షలే అంతిమం కారాదు: విద్యార్థులకు కోదండరామ్ సూచన
హైదరాబాద్: పోటీ పరీక్షలను సీరియస్గా తీసుకుని రాయాలేగానీ, అవే అంతిమం కాకూడదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ విద్యార్థులకు సూచించారు. పోటీ పరీక్షల్లో విఫలమయ్యామని అభ్యర్థులు కుంగిపోవద్దని చెప్పారు. తెలంగాణలో రాజకీయ పరివర్తన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. వలస ఆధిపత్యం నుంచి బయటపడేందుకు ఉద్యమాలు జరిగాయని వివరించారు.
శనివారంనాడు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షలపై అవగాహనా సదస్సులో ఆయన ప్రసంగించారు. పోటీ పరీక్షల కోసం పోటీ పడే అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. సామాజిక అంశాలపై దుబే రాసిన పుస్తకం పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సామాజిక ఉద్యమాలపై ఓపెన్ యూనివర్సిటీ ముద్రించిన పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పారు.
1953లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏనాడూ న్యాయం జరగలేదన్నారు. 1969 తర్వాత తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విలీనానికి ముందు జరిగిన ప్రక్రియపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెత్తనం సాగిస్తున్న వారిపై ఉద్యమాలు జరిగాయని అన్నారు. తెలంగాణకు ఆరు సూత్రాల పథకానికి సంబంధించి దక్కిన వాటిపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో పెత్తనానికి వ్యతిరేకంగా రెండో దఫా ఉద్యమం జరిగిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు.
ఇక్కడి నిధులు ఇక్కడ ఖర్చు పెట్టాలనేది పెద్ద మనుషుల ఒప్పందం, కానీ అమలులో అలా జరగలేదన్నారు. తెలంగాణ నిధులను ఆంధ్రాకు తరలించుకు పోయారని అన్నారు. సమకాలీన ఉద్యమంపై తెలుగు అకాడమీ పుస్తకం వస్తుందని, అభ్యర్థులు ఆ పుస్తకాన్ని చదవాలని సూచించారు.