లక్ష్మీస్ ఎన్టీఆర్పై సీఈసీకి ఫిర్యాదు: ఫిర్యాదు వస్తే పరిశీలిస్తామని తెలంగాణ ఈసీ
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల సంఘాన్ని కలిసిఫిర్యాదు చేశారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, తెలుగు రాష్ట్రాలలో జరగనున్న లోకసభ ఎన్నికల పైన ప్రభావం చూపేలా వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, దీనిని ఆపాలని కోరారు. సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను నెగిటివ్గా చూపించారన్నారు. ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఏప్రిల్ 11 వరకు ఈ సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించనున్నారు.
ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?
నేతల బయోపిక్ల విడుదలపై తమకు ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలంగాణ ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. ఎన్నికలలో సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచామని చెప్పారు. లోకసభ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగాయని, దీంతో తమకు ఇది కొంత సులభం అయిందన్నారు.