టీ న్యూస్కు నోటీసు: బాబుపై ఫిర్యాదు, భయంలేదు: దేవీప్రసాద్
హైదరాబాద్: టీ న్యూస్ ఛానల్కు నోటీసు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు మంగళవారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశాయి. దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు గవర్నర్ను కలిశారు. నోటీసులు వెనక్కి తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, అందుకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తే మీడియా సంస్థ నోరు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కానీ ఇవాళ ఆ చట్టాలను అతిక్రమించి ప్రవర్తిస్తున్నారన్నారు.
చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక మీడియా సంస్థను వెనకేసుకొస్తూ ఎన్నోసార్లు పత్రికా స్వేచ్ఛ అంటూ గీపెట్టారని పేర్కొన్నారు. ఒక మీడియా సంస్థకు వచ్చిన సోర్స్ గురించి చెప్పమని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు.
ఒక మీడియా ఛానల్కు నోటీసులు ఇవ్వడమంటే అది చట్టవిరుద్దమే అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు తనకు చుట్టుకున్న ఉచ్చును హైదరాబాద్కు చుడుతున్నాడన్నారు. కాగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గురించి టీడీపీ నేతలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
మత్తయ్య ఎక్కడ: నోముల
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని తెరాస నేత నోముల నర్సింహయ్య అన్నారు. ఏ-4 నిందితుడు మత్తయ్య ఎక్కడున్నాడన్నారు. మత్తయ్య తెలంగాణవాడు, తెలంగాణలో నేరం చేశాడు, ఎక్కడున్నాడని నిలదీశారు. మత్తయ్యను ఏపీ సర్కారు దాచిపెట్టిందన్నారు.
సండ్ర వెంకటవీరయ్య ఎక్కడున్నారన్నారు. నిందితులను దాచిపెట్టి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ ఇద్దరు నిందితులు ఏసీబీ విచారణకు సహకరించడంలేదన్నారు. వీరి విచారణ పూర్తయితే చంద్రబాబు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు.
చంద్రబాబు హైదరాబాద్లో పోలీసు స్టేషన్లు కట్టుకుంటానని అంటున్నారని, మీడియాకు నోటీసు ఇవ్వడం చట్ట విరుద్దమని తెలిసీ టీ న్యూస్కు నోటీసు ఇచ్చారన్నారు. సెక్షన్-8పై తాను చెప్పింది నిజమైందని యనమల చెప్పడం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కేసులో ట్యాపింగ్ జరగలేదని ఒకవేళ ట్యాపింగ్ జరిగితే తాము దేనికైనా సిద్ధమని నాయిని చెప్పారన్నారు.
బాబుది అప్రజాస్వామికం: దేవీప్రసాద్
సెక్షన్-8ను అమలు చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని దేవీప్రసాద్ అన్నారు. తామెవరం సెక్షన్-8 కు భయపడటం లేదన్నారు. సెక్షన్-8 అమలు చేయవద్దన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు.
సెక్షన్-8 అంటూ బీజేపీ-టీడీపీ ప్రభుత్వాల పొత్తుతో ఏమైనా చేయొచ్చనుకుంటే ఊరుకోమన్నారు. సెక్షన్-8ను అమలు చేస్తామంటే తెలంగాణ ఉద్యోగుల ప్రతిఘటన తప్పదన్నారు. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. రేపు మధ్యాహ్నం లంచ్ సమయంలో తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలుపుతామన్నారు.
అనాథపిల్లలపై కేసీఆర్
అనాథ పిల్లలకు ఓ విధానం ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. వారికి పాఠశాలలు అవసరమన్నారు. యాదగిరిగుట్టలో మొదటి పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. దానిని రాష్ట్రపతిచే ప్రారంభింపచేయాలన్నారు. త్వరలో అనాథాశ్రమాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. అనాథ పిల్లల గురించి త్వరలో ఉపసంఘం నివేదిక ఇస్తుందన్నారు.