జనసేనలో చేరాలనుకున్నారా?: వల్లభనేని హత్య వెనుక నిజాలు.., బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టించాడు..
శ్రీనివాసరావుకు, అమీర్పేట కార్పోరేటర్కు మధ్య కూడా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నేత వల్లభనేని శ్రీనివాసరావు హత్య ఉదంతం సంచలనం రేపుతోంది. ఆస్తుల గొడవలే ఆయన ప్రాణాలు తీశాయా?.. లేక వ్యక్తిగత వివాదాలే ప్రాణాల మీదకు తెచ్చాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
గురువారం తెల్లవారు జామున సనత్నగర్ బస్టాండ్ వద్ద శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కిరాతకంగా హత్య చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో మందు బాటిళ్లు ఉండటంతో.. మద్యం మత్తులోనే ఆయన హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్లో టీఆర్ఎస్ నేత వల్లభనేని దారుణ హత్య
సీసీ కెమెరాలు పనిచేయట్లేదు:
హత్య జరిగిన సనత్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో ఇటీవలే సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఇంకా కనెక్షన్ ఇవ్వకపోవడంతో హత్య తాలుకు దృశ్యాలేవి అందులో రికార్డు కాలేదు. సీసీటివి కెమెరాలు లేకపోవడంతో ఇక్కడే హత్య చేయాలని ముందుగానే పథకం రచించుకుని ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
డాగ్ స్క్వాడ్ తనిఖీలు:
శ్రీనివాసరావు హత్య అనంతరం కీలక ఆధారాలు సేకరించడానికి క్లూస్టీం, డాగ్స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డాగ్ స్క్వాడ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లి ఎస్ఆర్నగర్ పోలీస్టేషన్ వద్ద ఆగినట్టు సమాచారం. దీంతో నిందితులు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి ఉంటారా? అన్న ప్రచారం కూడా జరిగింది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.
బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలు:
సామాజిక సేవలో ముందుండే వల్లభనేని శ్రీనివాసరావు.. వల్లభనేని చారిటబుల్ ట్రస్టును స్థాపించారు. దాని ద్వారా పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అనాథలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్టు సమాచారం.
శ్రీనివాసరావు ఆంధ్రా ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ కేసీఆర్ నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలకొల్లు ఎల్లార్పేట ఆయన స్వగ్రమం. అప్పట్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. సనత్ నగర్ ప్రాంతంలో విద్యావేత్తగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
అ రోజే వివాదం:
గత అక్టోబర్ 19న దీపావళి పండుగ రోజున మంత్రి కేటీఆర్ సనత్ నగర్ బల్కంపేట శ్మశాన వాటిక ప్రారంభానికి వస్తున్నారని తెలిసి.. ఏర్పాట్లను శ్రీనివాసరావే పర్యవేక్షించారు. అయితే కేటీఆర్ కు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తన ఫోటో లేకపోవడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకుడిని శ్రీనివాసరావు ప్రశ్నించాడు.
అది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. స్థానిక నాయకుడి అనుచరులు శ్రీనివాసరావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. మరుసటి రోజు శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఈ విషయం అంతగా వెలుగులోకి రాలేదు.
ఆస్తుల గొడవలా?:
శ్రీనివాసరావు ఆస్తుల మీద కన్నేసినవారే ఆయనను హత్య చేసి ఉంటారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. శ్రీనవాసరావు భార్య ఆయనతో విడిపోయి మలేషియాలో ఉంటోంది. వీరికి పిల్లలు కూడా లేకపోవడంతో.. ఆయన ఆస్తిపై ఎవరైనా కన్నేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనివాసరావుకు దాదాపు రూ.20కోట్ల ఆస్తులు ఉండవచ్చునని తెలుస్తోంది. ఇటీవల తాను ఉంటున్న బల్కంపేటలోని లింగయ్యనగర్లో సాయీజ్ జయ ఆర్చిడ్ అనే అపార్టుమెంట్ను కొనుగోలు చేశాడు.
నిజానికి ఈ అపార్ట్ మెంటు వాసులకు శ్రీనివాసరావుకు తీవ్ర విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతా కలిసి ఆయనను అక్కడినుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నించినప్పటికీ.. తానే అపార్టుమెంటును కొనుగోలు చేసి శ్రీనివాసరావు వారికి షాక్ ఇచ్చాడు.
కేసు పెట్టిన కార్పోరేటర్:
శ్రీనివాసరావుకు, అమీర్పేట కార్పోరేటర్కు మధ్య కూడా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. తాగిన మత్తులో కార్పోరేటర్ను అసభ్య పదజాలంతో దూషించడంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఐపీసీ 504, 506సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా మంచివాడే అయినప్పటికీ శ్రీనివాసరావుకు నోటి దురుసు ఎక్కువనే ఆరోపణలున్నాయి.
జనసేనలో చేరడానికి సిద్దపడ్డారా?:
మూడు రోజుల క్రితం శ్రీనివాసరావుపై ప్రత్యర్థులు మరోసారి దాడి చేసినట్టు తెలుస్తోంది. వల్లభనేని ట్రస్టు ఆధ్వర్యంలో 3రోజుల క్రితం శ్రీనివాసరావు స్థానికులకు ఏకే గౌడ్ ఫంక్షన్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్, మదర్ థెరిస్సా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించాడు.
తన ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆంధ్రులకు రక్షణ కల్పిస్తారని నమ్మి తాను పార్టీలో చేరినట్టు తెలిపారు. కానీ స్థానిక నాయకుల నుంచి రక్షణ కల్పించలేకపోతున్నారని ఆయన వాపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన జనసేనలో చేరడానికి సిద్దమయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. స్థానిక నాయకులను విమర్శించడంతో అదేరోజు ప్రత్యర్థులు మరోసారి ఆయనపై దాడి చేశారని సమాచారం.