సింగరేణి బొగ్గు గనుల్లో కొనసాగుతున్న సమ్మె .. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సింగరేణి కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణిలో సమ్మె కొనసాగుతోంది.అందులో భాగంగా కార్మికులు నేడు విధులకు గైర్హాజరయ్యారు. ఏఐటీయూసీ, ఎన్ టి యు సి, సి ఐ టి యు , హెచ్ఎమ్ ఎస్, బి ఎమ్ ఎస్ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సింగరేణిలో గుర్తింపు పొందిన టీబీజీకేఎస్ సైతం సమ్మెకు మద్దతు ప్రకటించింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 28 భూగర్భ, 18 ఒపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోనూ సమ్మె కొనసాగుతోంది. మొత్తం 48,019 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రధానంగా సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికుల డిమాండ్లు పరిశీలిస్తే బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయాలని, కోల్ ఇండియా మొత్తాన్ని విడదీయ కుండా ఓకే కంపెనీగా ఉంచాలని కోరుతున్నారు. లాభాలలో భాగస్వాములైన కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాలను చెల్లించాలని, సింగరేణి బొగ్గు గనుల్లో నిలిపివేసిన వెంటనే వెంటనే చేపట్టాలని, ఉన్న ఖాళీలను ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల తో భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు కార్మికులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న కార్మికులు అన్ ఫిట్ అయినప్పటికీ వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ డిమాండ్లతో సమ్మెకు దిగిన కార్మికులు బొగ్గు గనుల్లో విధులకు హాజరు కాలేదు. సింగరేణి లో రోజుకు 2 లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సమ్మెతో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇప్పటికే భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.ఇప్పుడు సింగరేణి కార్మికుల సమ్మె తో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే సమ్మెను కొనసాగించే అవకాశం ఉంది.