స్పాల్లో కండోమ్స్? మూసేస్తాం: సందీప్ శాండిల్య వార్నింగ్
Recommended Video
హైదరాబాద్: స్పాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య హెచ్చరికలు జారీ చేశారు. స్పాల్లో కండోమ్స్ కనిపిస్తే వాటిని మూసేస్తామని హెచ్చరించారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు, మేనేజర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో మసాజ్ సెంటర్లు, పార్లర్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తుండడం ఆందోళనకరమని సందీప్ శాండిల్య అన్నారు.
అవి అలా కొనసాగితే అభ్యంతరం లేదు...
మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని సందీప్ శాండిల్య అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లుగానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతికేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత్యా నేరమని చెప్పారు.
రిజిస్టర్లు తప్పనిసరిగా ఉంచాలి.
స్పాలలో తప్పనిసరి రిజిస్టర్లు ఉంచాలని సందీప్ శాండిల్య చెప్పారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలని ఆదేశించారు. స్పాలలో బెడ్ల వాడకం అవసరం లేదన్నారు.సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్కు అనుమతించవద్దని అన్నారు.
వయో పరిమితి తప్పనిసరిగా...
18 ఏళ్ల వయసు కు తక్కువ ఉన్నవారిని అనుమతించవద్దని సందీప్ శాండిల్య సూచించారు. తప్పనిసరిగా సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు
బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్ లను తీసుకోవాలని సందీప్ శాండిల్య అన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 11 గంటల తర్వాత వైన్స్ షాపులు ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచకూడదని ఆదేశించారు. బార్ అండ్ రెస్టారెంట్లలోనూ ఇదే వర్తిస్తుందన్నారు. అయితే ఫుడ్ సర్వింగ్ తో కలిపి 11.30కు బిల్ కౌంటర్ కచ్చితంగా మూసివేయాలన్నారు. 12 తర్వాత కూడా కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే తప్పదు..
నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సిపి కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని సందీప్ శాండిల్య చెప్పారు. రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దుకు సిఫారసు చేస్తామని హెచ్చారించారు. కార్యక్రమం చివరలో కార్యాక్రమంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలన్నారు. సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.