వీడిన మిస్టరీ: ఉదయ్పై కాల్పులు జరిపిందే శశికుమారే
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని హిమాయత్నగర్లో జరిగిన డాక్టర్ల కాల్పుల కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్ ఉదయ్పై కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న శశికుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో కేసు అనేక మలుపులు తిరిగింది.
ఉదయ్పై కాల్పులు జరిపింది తాను కాదని సాయికుమార్ కాల్చాడని శశికుమార్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్మ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయికుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
డాక్టర్ ఉదయ్ చనిపోయారని అనుమానంతో శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావించారు. ఈ ఘటనలో సాయికుమార్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని, ఇతనికి ఎలాంటి సంబంధం లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.
శశికుమార్ ఆత్మహత్యపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఆయన భార్య ఆరోపించినట్లు కిరాయి హంతకులు హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శికుమార్ కాల్పులకు యత్నిస్తే తాను తప్పించుకున్నానని సోమవారం రాత్రి సాయికుమార్ చెప్పాడు. కాల్పుల్లో ఉదయ్ చనిపోయాడని భావించిన శశికుమార్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్య లేదా స్నేహితులెవరితోనైనా మాట్లాడి ఉంటే నిజం తెలిసి ఉండేదని, ఆత్మహత్య చేసుకునే వాడు కాదని భావిస్తున్నారు. కనీసం ఫాంహౌస్లో టీవీ ఉన్నా నిజం తెలుసుకుని ఉండేవారని అంటున్నారు.
తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సాయి కుమార్ చెప్పారు. పోలీసుల విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయ్పై శశికుమార్ కాల్పులు జరిపాడని ఆయన చెప్పారు.