కేసీఆర్ దగ్గరే తేల్చుకుందాం పదా!: మీడియా సాక్షిగా 'టీఆర్ఎస్ విబేధాలు'
మంత్రిపదవిని అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు, రాజకీయాల నుంచే తప్పుకుంటానని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సవాల్ విసిరారు.
మహబూబ్ నగర్: టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. మీడియా సాక్షిగా నేతలిద్దరూ బాహాబాహికి దిగిన పరిస్థితి తలెత్తడంతో పార్టీలో కలకలం మొదలైంది. అసలు విబేధాలే లేవని ఓ నేత మీడియాకు సర్దిచెప్పబోతుంటే.. లేదు, నీవల్లే అంతా జరిగిందంటూ మరో టీఆర్ఎస్ నేత ఆరోపణలకు దిగడంతో మీడియా ముందే ఈ విబేధాలు బహిర్గతమయ్యాయి.
మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సందర్బంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్-ఎంపీ జితేందర్ రెడ్డిల మధ్య ఈ విబేధాలు బయటపడ్డాయి. తొలుత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తో తనకెలాంటి విబేధాలు లేవని, కావాలనే మీడియాలో లేనిపోని కథనాలు రాస్తున్నారని ఆరోపించారు.
ఇంతలో జితేందర్ రెడ్డి వ్యాఖ్యలకు అడ్డుపడ్డ శ్రీనివాస్ గౌడ్.. తనకు మంత్రిపదవి రాకుండా జితేందర్ రెడ్డే అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ మంత్రి స్వయంగా తనతో చెప్పారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ తన అక్కసు వెళ్లగక్కడంతో ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పోటాపోటీ వ్యాఖ్యలు చేశారు.
మంత్రిపదవిని అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు, రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ఒకరు చెప్తే వింటారా? అందులోను మంత్రిపదవుల విషయంలో ఇంకొకరి మాట వింటారా? అని శ్రీనివాస్ గౌడ్ ను ప్రశ్నించారు. ఎవరో చెప్తే ఎలా నమ్ముతారని మండిపడ్డారు.
ఈ విషయంలో తాను చాలెంజ్ చేస్తున్నాని ప్రకటించారు. 'ఏ మంత్రి ఈ విషయం చెప్పాడో ఆయన్ని తీసుకుని సీఎం దగ్గరికి వెళ్దాం.. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా' అని సవాల్ చేశారు. నేతల మధ్య మాటల యుద్దం ముదురుతుండటంతో పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఇద్దరికి నచ్చజెప్పారు.