కేసీఆర్ సర్కారు నుంచి బహుమానాలు: వెంకయ్యపై జైరామ్ తీవ్ర ఆరోపణలు
కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ ఆరోపణలు చేశారు. వెంకయ్యనాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారని రమేశ్ తెలిపారు.
దీని వల్ల రూ. 2కోట్ల వరకు ప్రయోజనం పొందారని ఆరోపించారు. వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు.
అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పేదలకు చెందిన భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా, గోసంరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల అంశంపై చర్చించాలని లోక్సభలో సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదట ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే జీరో అవర్లో ఈ అంశాన్ని చర్చిద్దామని స్పీకర్ సుమ్రితా మహాజన్ అన్నారు.
అయినా, ప్రతిపక్షాలు శాంతించలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే బీజేపీ సభ్యులు మాత్రం బోఫోర్స్ కుంభకోణంపై చర్చించాలని నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని సభ్యులను స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. అంతేగాక, కాగితాలను చించి స్పీకర్ వైపు విసిరారు. దీంతో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ వేటువేశారు.