'కేసీఆర్ను కలిశాక అది సరైనదేననిపించింది': నిన్న సబిత చేతిలో ఓడిన తీగల.. నేడు కలిశారు
హైదరాబాద్: మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయులతో కలిసి బుధవారం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెరాసలో చేరే విషయంపై కేసీఆర్తో సబిత చర్చించారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
సబితా ఇంద్రారెడ్డి సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా?: ప్రగతి భవన్కు సండ్ర
కేసీఆర్ను కలిశాక ఆ నిర్ణయం సరైనదే అనిపించింది
కేసీఆర్తో భేటీ అనంతరం సబిత తనయుడు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతామన్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ను కలిసిన తర్వాత పార్టీ మార్పుపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదనని అనిపించిందన్నారు. కేసీఆర్తో భేటీ సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
చేవెళ్లను గెలుచుకుంటాం
సబితా రెడ్డి తన ముగ్గురు తనయుడులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డిలతో కలిసి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై కూడా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెరాసకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ఆదరణ నేపథ్యంలో అధికార పార్టీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను కలిసి పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. వీలైనంత త్వరగా తెరాసలో చేరాలని సబిత, కార్తీక్లు నిర్ణయించుకున్నారు. కేసీఆర్తో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ... చేవెళ్ల లోకసభ నియోజకవర్గాన్ని తెరాస గెలుచుకునేలా చేస్తామని చెప్పారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, కార్తీక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
సబితను కలిసిన తీగల
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి గురువారం ఉదయం ఎమ్మెల్యే సబితను కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబిత గెలవగా, తెరాస నుంచి పోటీ చేసిన తీగల ఓడిపోయారు. ఇప్పుడు తీగల ఆమె ఇంటికి వెళ్లడం గమనార్హం. ఆమె పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా తెలుస్తోంది.