ఖమ్మం సీటుపై కాంగ్రెస్ గురి .. మాటల తూటాలు పేలుస్తున్న రేణుకా చౌదరి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీచినా ఖమ్మంలో మాత్రం ప్రతికూల పవనాలు వీచాయి. ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క స్థానానికే టిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని ఎలాగైనా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేయాలని రేణుకాచౌదరిని రంగంలోకి దింపింది.
రేణుకా చౌదరికి పోటీగా టీఆర్ఎస్ నుండి టీడీపీ ఫిరాయింపు నేత నామా
గత ఎన్నికల అనుభవంతో టిఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఖమ్మం లోక్ సభ నియోజక వర్గాన్ని టిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మకంగా టీడీపీ నుండి వచ్చిన నామా నాగేశ్వరరావు కు టిక్కెట్ ఇచ్చి బరిలోకి దింపింది. ఖమ్మం జిల్లాలో టిడిపికి పట్టు ఉన్ననేపథ్యంలో చాలా సీనియర్ నాయకుడైన నామా నాగేశ్వరరావును ఎన్నికల బరిలోకి దింపితే ఖచ్చితంగా విజయం సాధించడం సాధ్యమవుతుందని భావించింది టీఆర్ఎస్.
సింగిల్ హ్యాండెడ్ గా రేణుక ప్రచారం .. నామా కోసం ఆ నలుగురు ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఇద్దరు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు కంటే నాలుగు అడుగులు ముందుకు వేసి రేణుకా చౌదరి ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఇటు నామా గెలుపు కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇలా ఎంతో మంది నాయకులు ప్రచారం నిర్వహిస్తుండగా, రేణుక చౌదరి మాత్రం సింగిల్ హ్యాండెడ్ గా ప్రచారంలో ముందుకు వెళుతోంది. ఫిరాయింపు నేతలకు బుద్ధి చెప్పాలి అన్న పిలుపుతో ప్రచారం సాగిస్తోంది.
మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్
మాటల తూటాలు పేలుస్తున్న రేణుకా చౌదరి ... ఖమ్మంపై కాంగ్రెస్ గురి
మొన్నటికి మొన్న కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడని సెటైర్లు వేసిన రేణుక చౌదరి అటు కేసీఆర్ ను, ఇటు కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు.ఇక తాజాగా ప్రచారంలో మోడీకి కుటుంబం ఉంటే మహిళలు, పిల్లల విలువ తెలిసేది అని ప్రచారం లో రేణుక మాట్లాడారు. మోడీకి కుటుంబాన్ని పోషించే బాధ్యత లేదు కాబట్టి అలాంటి వ్యక్తికి వాత్సల్యం గురించి ఏం తెలుస్తుందంటూ ప్రశ్నించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటున్న టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న 14 మందితో ఏం చక్రం తిప్పారో చెప్పాలని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు ఊపిరాడనివ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్న రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఖమ్మం స్థానాన్ని ఏ మేరకు గెలిపిస్తారో వేచి చూడాలి.