ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మున్సిపోల్స్ తో కాంగ్రెస్ , బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు ఛీ కొట్టారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజలు టీఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరధం పట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు ..పరకాల,చెన్నూరు,మరిపెడ మున్సిపాలిటీలు కైవసం
తెలంగాణలో ఆ పార్టీల దుకాణం బంద్ అన్న ఎర్రబెల్లి
ఇక తెలంగాణలో ఆ పార్టీల దుకాణం బంద్ అయ్యిందని , తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోర్డులు తిప్పేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు . నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అన్ని మున్సిపాలిటీలను పూర్వ వరంగల్ జిల్లాలో కైవసం చేసుకున్నామన్నారు. పూర్వ వరంగల్ జిల్లా ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ ఎంతో రుణపడి ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు .
ప్రతిపక్షాలను ఛీ కొడుతున్నా ఆ పార్టీల బుద్ది మారడం లేదని విమర్శ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పనితనమే, సమర్ధతే ఇంత గొప్ప విజయానికి కారణమని ఆయన కొనియాడారు.హుజూర్ నగర్ ఎన్నికల నుంచి ప్రజలు ప్రతిపక్షాలను ఛీ కొడుతున్నా ఆ పార్టీల బుద్ది మారడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కూసిన పాడు కూతలు ప్రజలు ఎవ్వరూ నమ్మలేదని ఆయన పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో మరో సారి ఓటు ద్వారా ప్రజలు ఆ పార్టీలకు బుద్ది చెప్పారని తెలిపారు .తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పట్టణ ప్రజలు ఇలాంటి తీర్పునివ్వడం నేను ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నారు .
ఉమ్మడి వరంగల్ లో విజయం సాధించటంతో మంత్రి హర్షం
ఒక్క పార్టీ ఎప్పుడు మహబూబాబాద్లో జెండా ఎగురవేయలేదని చెప్పిన ఆయన ఈసారి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీలను గులాబీ ఖాతాలో వేసే బాధ్యత తీసుకున్న ఎర్రబెల్లి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని విజయం సాధించి తన పట్టు నిరూపించుకున్నారు.