తెలంగాణ కాంగ్రెస్కు యంగ్&డైనమిక్ ఇంచార్జి... మరి పీసీసీ చీఫ్ని మార్చేదెప్పుడు..?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన యంగ్&డైనమిక్ ఎంపీ మణికం ఠాగూర్ను(45) ఆ పార్టీ నియమించింది. ప్రస్తుత ఇంచార్జి కుంతియా స్థానంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నిజానికి కుంతియా పదవీ కాలం కొద్ది నెలల క్రితమే ముగిసినప్పటికీ... కొత్త ఇంచార్జి నియామకంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
తాజాగా నియమితులైన మణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ నియోజకవర్గం నుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరవుతున్న ఆయన... త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నుంచి మణికం ఠాగూర్ అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్యూఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా,ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా,సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఛత్తీస్గఢ్,బెంగాల్,బిహార్,అసోం,హర్యానా,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త ఇంచార్జి నియామకంతో... మరి కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడన్న చర్చ మొదలైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పు ఉంటుందన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ... అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టబోయే మణికం ఠాకూర్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు,పార్టీ స్థితి గతుల గురించి తెలుసుకుని ఏఐసీసీకి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది,
ఇందుకోసం ఆయన పార్టీ సీనియర్లు,జిల్లాల అధ్యక్షులతో మాట్లాడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ని మార్చాలా.. లేక ఆ తర్వాతే మార్పులు అవసరమా అన్న దానిపై ఆయన పరిస్థితులను సమీక్షించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా... అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video
ఒకవేళ పీసీసీ చీఫ్ని మారిస్తే... తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితర నేతల పేర్లు కొన్నాళ్లుగా చర్చల్లో నానుతున్నాయి. ప్రధానంగా రేవంత్ పేరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నప్పటికీ... సొంత పార్టీ సీనియర్లే ఆయనకు అడ్డు తగులుతున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారి కూడా సీనియర్ల మాటనే పరిగణలోకి తీసుకుంటుందా.. లేక వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా పీసీసీ చీఫ్ని నియమిస్తుందా అన్నది వేచి చూడాలి.