నిన్న టీఆర్ఎస్, నేడు కాంగ్రెస్... సిపిఐ ఎవరికి మద్దతిస్తుందో...?
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు సిపిఐ మద్దతు కోసం తాపత్రయపడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నేతలు సిపిఐ మద్దతు కోరేందుకు ఆపార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు చాడ వెంకట్రెడ్డితో పాటు ఇతర నేతలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంంలోనే నేడు కాంగ్రెస్ నేతలు సైతం సిపిఐ నేతలతో సమావేశం అయ్యారు.
హుజుర్నగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అటు అధికార టీఆర్ఎస్ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరి పోరాడుతున్నాయి. గెలుపుకోసం భావసారూప్యత గల పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక అడుగు ముందుకు వేసిన అధికార టీఆర్ఎస్ గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడు లేనివిధంగా పోత్తుకోసం సిపిఐ పార్టీ కార్యాలయానికి వెళ్లింది. సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డితో సమావేశం అయ్యారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి తమ నిర్ణయం చెబుతామని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సిపిఐ నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రెండు పార్టీల మధ్య ఎలాంటీ భేదాభిప్రాయాలు లేవని ఇరు పార్టీల నేతలు చెప్పారు. గతంలో ఇరుపార్టీల మధ్య జరిగిన పొరపాట్లపై చర్చించినట్టు చెప్పారు. ఈనేపథ్యంలోనే మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారని సిపిఐ నేతలు చెప్పారు. అయితే మద్దతు ఇచ్చే అంశంపై జాతీయా పార్టీ నేతలతో కలిసి చర్చిస్తామని స్పష్టం చేశారు.