నిన్న తెలంగాణ కోసం, నేడు ఆకాంక్ష కోసం.. కొత్త పార్టీ: కెసిఆర్కు షాకిచ్చేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు రాష్ట్ర సాధన కోసం పార్టీలు పుట్టుకు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి నేతృత్వంలో ఓ పార్టీ పుట్టుకు వస్తుందని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం కమలం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొత్త పార్టీ వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యెన్నం ప్రస్తుతం పని చేస్తున్న 'తెలంగాణ బచావత్'.. స్థాపకులు నాగం దానిని పార్టీగా మార్చవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, యెన్నం శ్రీనివాస్ రెడ్డియే కొత్త పార్టీ పెడతారా అనే చర్చ కూడా సాగుతోంది. యెన్నం సోమవారం తన రాజీనామా లేఖను బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో కొత్త పార్టీ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ... ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం సన్మానించలేదని మండిపడ్డారు. తాము ఉద్యమకారులను సన్మానిస్తామని చెప్పారు. తెలంగాణలో టిఆర్ఎస్కు కాంగ్రెస్, బిజెపి ప్రత్యామ్నాయం కావడం లేదన్నారు. అందుకే సాధించిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక వస్తుందన్నారు.