సీఎం టైమివ్వట్లేదు: సంపత్, వార్త రాస్తే మీడియాను బెదిరిస్తున్నారు: లక్ష్మణ్
హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తోందని, సాగునీటి సమస్యను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకు వెళ్దామంటే ఆయన అపాయింటుమెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరులో రెండు నదులు ప్రవహిస్తున్నా సాగునీరు అందడం లేదన్నారు. ఆర్డీఎస్ను బూచిగా చూపి కెసిఆర్ ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. వలసలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. కెసిఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
కెసిఆర్కు ప్రజలు బుద్ధి చెబుతారు: డాక్టర్ కె లక్ష్మణ్
ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి వార్తలు రాస్తున్న మీడియాను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా విపక్షాలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఇలా సస్పెండ్ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రభుత్వ అధికారులు టిఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు రీయింబర్సుమెంట్స్ ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినట్లుగానే వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.